Delhi: దీపావళి వేళ.. ఢిల్లీలో 200కుపైగా అగ్నిప్రమాదాలు!

13 Nov, 2023 12:03 IST|Sakshi

దీపావళి రోజున దేశరాజధాని ఢిల్లీలో 208 అగ్ని ‍ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు అగ్ని ప్రమాదాలకు సంబంధించి లెక్కలేనన్ని ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఈ అగ్నిప్రమాదాల్లో 22 ఘటనలు బాణసంచా కాల్చడం కారణంగానే సంభవించాయి. 

దీపావళి రోజున జరిగిన చిన్న, మధ్యతరహా,  తీవ్రమైన అగ్నిప్రమాదాలకు సంబంధించి ఇప్పటివరకు 208 ఘటనలు చోటుచేసుకున్నాయని డిపార్ట్‌మెంట్ హెడ్ అతుల్ గార్గ్ తెలిపారు. ఢిల్లీలోని సదర్ బజార్, ఈస్ట్ ఆఫ్ కైలాష్, తిలక్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక సమాచారం రాలేదు. 

అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సెంట్రల్ ఢిల్లీలోని సదర్ బజార్‌లోని డిప్యూటీ గంజ్ మార్కెట్‌లోని గోదాములో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు 22 అగ్నిమాపక శకటాలు శ్రమించాయి. దాదాపు 2 గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. గోదాములో ఉంచిన వస్తువులన్నీ దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేరకు నష్టం జరిగిందన్న సమాచారం అందుబాటులో లేదు. 

పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్కెట్‌లోని కొన్ని దుకాణాలు అగ్నికి ఆహుతైనట్లు  ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసుల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. 
ఇది కూడా చదవండి: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో విషాదం

మరిన్ని వార్తలు