రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..!

5 Dec, 2023 19:52 IST|Sakshi

సక్సెస్‌కి మారుపేరుగా నిలవాలంటే జెండర్‌తో పని ఏముంది. పట్టుదల ఉండాలి...దానికి తగ్గ కృషి, వీటన్నింటికీ మించిన సంకల్పం ముఖ్యం. దీనికి ఆత్మ విశ్వాసాన్ని, కఠోర శ్రమను జోడించి సక్సెస్‌తో సలాం చేయించుకుంటూ ఈ విషయంలో  మేమేం తక్కువ కాదంటోంది మహిళా శక్తి. వివక్షల్నీ, అడ్డంకుల్నీ అధిగమించి వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా శక్తికి,  సాధికారతకు, నిదర్శనంగా నిలిచారు ముగ్గురు ధీర వనితలు.  దేశం గర్వించేలా భారత నారీశక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. 

అక్షతా కృష్ణమూర్తి
అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)తో కలిసి మార్స్ రోవర్‌ను నిర్వహించే తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ డా. అక్షతా కృష్ణమూర్తి. పెద్ద పెద్ద కలలు కనడం పిచ్చితనమేమీ కాదు.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. ఆశయ సాధనలో అలుపెరుగక పనిచేస్తూ పొండి... విజయం మీదే, నాదీ గ్యారంటీ అంటారామె. అంగారక గ్రహంపై రోవర్‌ను ఆపరేట్ చేయనున్న తొలి భారతీయ  మహిళగా  అవతరించిన తన  సక్సెస్‌ జర్నీని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్‌ చేశారు. 13 ఏళ్ల క్రితమే  నాసాలో పని చేయాలనేది ఆమె కల. భూమి ,అంగారక గ్రహంపై సైన్స్ అండ్‌  రోబోటిక్  ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించాలనేది చిరకాల డ్రీమ్‌.  అలా అమెరికా ప్రయాణం  ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో  లక్ష్యాన్ని సాధించేంతవరకు ఎవరేమన్నా పట్టించుకోలేదు. 

A post shared by Dr. Akshata Krishnamurthy | Rocket Scientist (@astro.akshata)

కానీ ఇది అంత  సులువుగా ఏమీ జరగలేదు. పీహెచ్‌డీ  డిగ్రీనుంచి నాసాలో ఫుల్‌ టైం ఉద్యోగం వచ్చేదాకా  ఎంతో కష్టపడ్డాను  అని చెప్పారు. ఈ రోజు, అంగారక గ్రహంనుంచి అనేక శాంపిల్స్‌ను  భూమికి  తీసుకురావడానికి రోవర్‌తో సహా పలు కూల్ స్పేస్ మిషన్‌లలో పని చేస్తున్నాను అని పేర్కొన్నారు. అక్షత MIT (మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుండి  పీహెచ్‌డీ ఏశారు.  నాసాలో చేరిన అతికొద్ది మంది భారతీయుల్లో ఆమె  కూడా ఒకరు. నాసాలో ప్రధాన పరిశోధకురాలిగా గత  ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. 

మహిళా ఆర్మీ డాక్టర్  కెప్టెన్ గీతిక కౌల్  
సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లోని భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. స్నో లెపార్డ్‌ దళానికి చెందిన కెప్టెన్ గీతికా కౌల్  చరిత్ర సృష్టించారు. హిమాలయాల ఉత్తర భాగంలో ఉన్న సియాచిన్ బాటిల్ స్కూల్‌లో  కఠినమైన ఇండక్షన్ శిక్షణను సక్సెస్‌ఫుల్‌గా ప పూర్తి చేసి మరీ ఈ కీలకమైన మైలురాయిని  సాధించారు.  అనేక అడ్డంకులను ఛేదించి అంకితభావంతో, దేశానికి సేవ చేయడం  స్ఫూర్తిదాయకం.


స్క్వాడ్రన్  లీడర్ మనీషా పాధి 
తొలి మహిళగా రికార్డు క్రియేట్‌ చేసిన మరో మహిళా శక్తి స్క్వాడ్రన్ లీడర్   మనీషా పాధి. మిజోరాంలో గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి కీలక పదవిలో  పాధిని ఎంపిక చేశారు. 2015 బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన Sqn లీడర్ మనీషా పాధిని భారత సాయుధ దళాల నుండి భారతదేశపు తొలి మహిళా సహాయకురాలుగా (ఎయిడ్‌-డే-క్యాంప్‌) నియమించారు.అధికారికంగా ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు.  Sqn లీడర్ మనీషా పాధి మూడు కీలక పదవులను కూడా నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పూణే, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, భటిండాలో పనిచేశారు. 

ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన మనీషా తండ్రి ఇన్స్పిరేషన్‌. ఆమె భర్త మేజర్ దీపక్ సింగ్ కర్కీ ఇండియన్‌ ఆర్మీలో పని చేస్తున్నారు. భువనేశ్వర్‌లోని CV రామన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన మనీషా  2015లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్  టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఏఐఎఫ్‌లో  చేరారు.

ఏడీసీ అంటే?
గవర్నర్‌కు వ్యక్తిగత సహాయకురాలిగా  అధికారిక పర్యటనలలో కూడా రాజ్యాంగ అధికారంతో వెంట ఉంటారు. ప్రతి గవర్నర్‌కు ఇద్దరు ADCలు ఉంటారు, ఒకరు సాయుధ దళాల నుండి , మరొకరు పోలీసు అధికారి. మిజోరంలో,రెండో ఏడీసీ రాష్ట్ర పోలీసు అధికారిగా జోనున్ తారా ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు