పరారీలో యూట్యూబర్ కటారియా.. ఆచూకీ చెబితే రూ.25వేల రివార్డ్‌

27 Aug, 2022 09:48 IST|Sakshi

డెహ్రాడూన్‌: విమానంలో సిగరెట్‌ తాగుతూ, రోడ్డుపై మద్యం సేవిస్తూ ఇటీవల వైరల్‌గా మారిన ప్రముఖ యూట్యూబర్‌ బాబీ కటారియా అరెస్ట్‌కు పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్‌లో రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ట్రాఫిక్‌ జామ్‌కు కారణమైన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బాబీ కటారియాను అరెస్ట్‌ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబర్‌ ఆచూకీ చెప్పిన వారికి రూ.25,000 రివార్డ్‌ అందిస్తామని ప్రకటించారు.

‘నిందితుడిపై నాన్‌ బెయిలెబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. కటారియాను అరెస్ట్‌ చేసేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లో అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు ఉత్తరాఖండ్‌ పోలీసులు. కానీ, అతడు పారిపోయాడు. దాంతో అతడిని పట్టుకునేందుకు రూ.25,000 రివార్డ్‌ ప్రకటించటం జరిగింది.’అని తెలిపారు డెహ్రాడూన్‌ ఎస్‌ఎస్‌పీ దిలీప్‌ సింగ్‌ కున్వార్‌. ముస్సోరీ కిమాడి మార్గ్‌లో రోడ్డ మధ్యలో టెబుల్‌ వేసుకుని మద్యం సేవిస్తూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించాడని తెలిపారు. అలాగే మద్యం మత్తులో బైక్‌ ప్రమాదకరంగా నడిపాడన్నారు. దీంతో బాబీ కటారియాపై 342,336,290,510, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు దిలీప్‌ సింగ్‌.

ఇదీ చదవండి: స్పైస్‌జెట్‌ విమానంలో సిగరెట్‌ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు

మరిన్ని వార్తలు