రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి.. ఫ్యామిలీకి రూ.3.11కోట్ల పరిహారం..

5 Feb, 2023 18:11 IST|Sakshi

ముంబై: రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.3.11 కోట్లు చెల్లించాలని ట్యాంక్ ఓనర్, ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్. ఈ మొత్తాన్ని మృతుడి తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలకు(మైనర్లు)  అందించాలని సూచించింది. అత్యధిక నష్టపరిహానికి సంబంధించిన ఘటనల్లో ఇదీ ఒకటి కావటం గమనార్హం.

ఏంటీ కేసు..?
మహారాష్ట్ర ముంబైలో 2018 డిసెంబర్ 6న ప్రశాంత్ విశ్వాస్ర(37) స్కూటీని ఓ జంక్షన్ వద్ద ట్యాంకర్ వెనుకనుంచి ఢీకొట్టింది. స్కూటీపైనుంచి కిందపడిన అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. అదే రోజు మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష‍్యం వల్లే ప్రశాంత్ చనిపోయాడని కుటుంబసభ్యులు  క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. ట్యాంకర్ ఓనర్ దీనా బీ గవాడే, ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లించాలని కోరారు.

అయితే ట్రైబ్యునల్ నోటీసులు పంపినా దీనా హాజరుకాలేదు. మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఫిర్యాదును వ్యతిరేకించింది. యాక్సిడెంట్ సమయంలో ట్యాంకర్ డ్రైవర్ మద్యంలో ఉన్నాడని చెప్పింది. డ్రైవర్ మద్యం సేవించాడని డాక్టర్లు నిర్ధరించినప్పటికీ అతను సాధారణ స్థితిలోనే ఉన్నాడని రిపోర్టులో ఉందని ట్రైబ్యునల్ పేర్కొంది. అతను సాధారణ వ్యక్తిలాగే ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడాడని, తూగకుండా సరిగ్గానే నడిచాడని పేర్కొంది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష‍్యంగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. 

పోలీసులు నమోదు చేసిన ఎఐఆర్‍ను పరిశీలించి సెక్యూరిటీ సంస్థలో జోనల్‌ హెడ్‌గా పనిచేస్తున్న ప్రశాంత్  ఏడాదికి రూ.17లక్షల జీతం పొందుతున్నాడని గుర్తించిన ట్రైబ్యునల్.. అన్ని లెక్కలు వేసి అతని కుటుంబానికి రూ.3.11 కోట్లు పరిహారంగా ఇవ్వాలని ట్యాంకర్ ఓనర్, ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. 20వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌..

మరిన్ని వార్తలు