ఉత్సవాల సందర్భంగా భారీగా ఆదాయం

11 Feb, 2021 16:59 IST|Sakshi

జైపూర్‌: రోజురోజుకు ప్రజల్లో భక్తి భావన పెరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఎన్నో రంగాలు బతుకుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెంచేవి కావడంతో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా రెట్టింపవుతోంది. పరిస్థితి ఇలా ఉండడంతో ఎక్కడ ఉత్సవాలు జరిగినా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని ఓ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో ఆదాయం ఊహించని రీతిలో వచ్చింది. ఆ ఆదాయం చూస్తే దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న ఆలయాలు షిర్డీ, తిరుమల చిన్నబోయేట్టు ఉన్నాయి.

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గడ్‌లో సన్వాలియా సేథ్ ఆలయం ఉంది. ఆ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఇటీవల చతుర్ధశి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలు ముగియడంతో హుండీని తెరిచారు. హుండీలు బరువుగా ఉన్నాయి. తెరచి చూడగా అధికారులు ఊహించని స్థాయిలో కానుకలు వచ్చాయి. నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు భారీగా ఉన్నాయి. మొత్తం లెక్కించగా హుండీ ఆదాయం అక్షరాల 6 కోట్ల 17 లక్షల 12 వేల 200 రూపాయలు వచ్చింది. ఇక బంగారం 91 గ్రాములు, వెండి 4 కిలోల 200 గ్రాములు కానుకగా వచ్చింది. నేడు కూడా హుండీ లెక్కింపు కొనసాగుతోంది. ఆలయ అధికారులు, కలెక్టర్‌ ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. మొత్తం కలిపితే ఆదాయం ఎంత వస్తుందోనని ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు