వీకెండ్‌ పిక్‌నిక్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

29 Aug, 2022 15:45 IST|Sakshi

రాయ్‌పుర్‌: వారాంతంలో సరదగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు కొటడాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న రామ్‌దాహా వాటర్‌ఫాల్స్‌ వద్దకు ఆదివారం పిక్‌నిక్‌కు వచ్చినట్లు చెప్పారు.

జలపాతం కింద స్నానం చేస్తుండగా అక్కడి నీటిలో ఏడుగురు తప్పిపోయినట్లు ఆదివారం సమాచారం అందిందని అధికారులు తెలిపారు. అందులో ఇద్దరిని రక్షించించి ఆసుపత్రికి తరలించారు. అయితే, అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ తర్వాత మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. సోమవారం ఉదయం మిగిలిన ముగ్గురు టూరిస్టుల మృతదేహాలను వెలికితీశారు. 

సోమవారం వెలికి తీసిన మృతులు.. శ్వేత సింగ్‌(22), శ్రద్ధా సింగ్‌(14), అభయ్‌ సింగ్‌(22)లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. నీటిలోకి దిగి స్నానం చేయకూడదనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ.. టూరిస్టులు స్నానం చేసేందుకు వెళ్లటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: గుంతలో పడి అదుపుతప్పిన బైక్‌.. లారీ తొక్కటంతో యువకుడు మృతి! 

మరిన్ని వార్తలు