Rahul Gandhi Case: పరువునష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్‌ కొట్టివేత

20 Apr, 2023 11:19 IST|Sakshi

గుజరాత్‌ కోర్టులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్‌ సెషన్స్‌ గురువారం కోర్టు కొట్టివేసింది. దీంతో ఇదే కేసులో రాహుల్‌ గాంధీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించనున్నారు. 

కాగా 2019 కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ట్రయల్‌ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని, రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్‌ గాంధీ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు.

శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్టకు నష్టంం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్‌ పిటిషన్‌పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఆర్‌పీ మొగేరా.. తీర్పును నేటికి రిజర్వు చేశారు. తాజాగా రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలన్న రాహుల్‌ అభ్యర్థనను సెషన్స్‌ కోర్టు తోసిపుచ్చింది.
చదవండి: భారీగా నమోదైన కోవిడ్‌ మరణాలు.. ఒక్క కేరళలోనే 11 మంది మృతి

రాహుల్‌పై నమోదైన కేసు ఏంటి?
2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘దొంగలంతా మోదీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు?’ అని అన్నారు. ఈ మేరకు నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీ అంటూ పలు పేర్లను ఉదహరించారు. దీనిపై సూరత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ రాహుల్‌పై పరువు నష్టం కేసు వేయగా.. గత నెలలో సూరత్‌ దిగువ కోర్టు విచారణ జరిపి దోషిగా నిర్ధారించింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది.

ఆ వెంటనే ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ, పై కోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. ఈ తీర్పు వెలువరించిన మరుసటి రోజే రాహుల్‌ ఎంపీ సభ్యత్వాన్ని లోక్‌ సభ సచివాలయం రద్దుచేసింది. 
చదవండి: అతీక్‌ హత్య కేసులో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్‌

మరిన్ని వార్తలు