రోడ్డు ప్రమాదానికి గురైన తెలంగాణ సీఐడీ చీఫ్‌, భార్య మృతి

10 Oct, 2022 18:58 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో తెలంగాణ సీఐడీ డీజీపీ గోవింద్‌ సింగ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జైసల్మేర్‌ జిల్లాలోని తనోత్‌ మాత ఆలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తుండగా.. రాంఘర్‌-టానోట్ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న మహీంద్రా కారు బొల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో గోవింద్‌ సింగ్‌ భార్య షీలా సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గోవింద్‌ సింగ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జవహర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోవింద్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. 

 రాజస్థాన్ లోని రాంఘర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐడీ. విభాగం చీఫ్‌ గోవింద్ సింగ్ సతీమణి మరణించడంపై డీజీపీ మహేందర్‌ రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న  తమ సహచర సీనియర్ అధికారి గోవింద్ సింగ్ త్వరితగతిన కోలుకోవాలని డీజీపీ ఆకాంక్షించారు.
చదవండి: బీజేపీ షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ సమాధానం.. ఏమన్నారంటే!

మరిన్ని వార్తలు