CM Bhagwant Mann: చండీగఢ్‌ ఇచ్చేయాల్సిందే.. కేంద్రానికి డిమాండ్‌.. పంజాబ్‌ అసెంబ్లీలో సీఎం భగవంత్‌ మాన్‌ తీర్మానం

1 Apr, 2022 13:11 IST|Sakshi

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మరో సంచలనానికి తెర తీశారు. శుక్రవారం విధాన సభ ప్రత్యేక సమావేశాల్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారాయన. చండీగఢ్ నగరాన్ని పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ తీర్మానం చేశారాయన. చండీగఢ్‌పై సర్వహక్కులు తమవేనని, వెంటనే దానిని వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారాయన.

కేంద్రపాలిత ప్రాంత హోదాలో చండీగఢ్ ప్రస్తుతం పంజాబ్‌-హర్యానాల సంయుక్త రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. పరిపాలనాపరంగా 60:40గా పంజాబ్‌, హర్యానాలు చండీగఢ్‌నును పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో చండీగఢ్‌పై సర్వహక్కులు పంజాబ్‌వేనని, అందుకే పూర్తిగా పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ ఒక తీర్మానం చేశారు సీఎం భగవంత్‌ మాన్‌. దీనికి ఆర్థిక మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా మద్దతు ప్రకటించగా.. తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

ఇదిలా ఉండగా.. పంజాబ్‌ సర్వీస్‌ రూల్స్‌కు బదులు ఛండీగఢ్‌ ఉద్యోగులకు సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ మధ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కౌంటర్‌గా చండీగఢ్‌.. పంజాబ్‌కే పూర్తి రాజధానిగా ఉండాలంటూ  తీర్మానం సీఎం భగవంత్‌ మాన్‌ ప్రవేశపెట్టడం విశేషం. 

తీర్మానం సందర్భంగా.. భగవంత్‌ మాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛండీగఢ్‌ నుంచి కాకుండా బయటి వాళ్లను(కేంద్ర సర్వీస్‌ ఉద్యోగులతో) నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అంతేకాదు ఇంతకాలం కొనసాగిన సమతుల్యతను దెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారాయన. భాక్రా బియస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులో కేంద్ర ఉద్యోగుల్ని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఛండీగఢ్‌ పంజాబ్‌ రాజధానిగా పునరుద్ఘాటించిన సీఎం మాన్‌.. ఇంతకు ముందు ఇలా రాష్ట్రాలు విడిపోయిన సందర్భాల్లో రాజధాని మాతృరాష్ట్రంతోనే ఉన్న విషయాన్ని సైతం ప్రస్తావించారు. కాబట్టి, చంఢీగఢ్‌ను పంజాబ్‌కు బదిలీ చేయాలని అన్నారు. గతంలో సభ ఇందుకు సంబంధించి ఎన్నో తీర్మానాలు చేసినా లాభం లేకుండా పోయిందని, ఈసారి దానిని సాధించి తీరతామని చెప్పారాయన. 

పంజాబ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం.. పంజాబ్‌ రాష్ట్రం ఏర్పడింది. ఆపై పునర్వ్యవస్థీకరణతో హర్యానా పుట్టుకొచ్చింది. ఛండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా, పంజాబ్‌లో కొంత భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో కలిసిపోయాయి. అప్పటి నుంచి భాక్రా బియస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు లాంటి సంయుక్త ఆస్తుల మీద పరిపాలనను పంజాబ్‌-హర్యానాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

మరిన్ని వార్తలు