Constables Clash In Bihar: నడిరోడ్డుపై కానిస్టేబుళ్ల కొట్లాట.. ఎందుకంటే..?

18 Sep, 2023 21:32 IST|Sakshi

పాట్నా: బిహార్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై ముష్టియుద్ధానికి దిగారు. జనం చూస్తున్నారనే విషయం కూడా పట్టించుకోకుండా కొట్టుకున్నారు. బిహార్‌లో నలందకు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

లంచం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదంతో వీడియో ప్రారంభం అవుతుంది. లంచం తీసుకున్నట్లు ఒప్పుకోవాలని ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకుని ప్రశ్నించడంతో ఘర్షణ మొదలయ్యింది. నడిరోడ్డుపైనే ఇద్దరు దాదాపు ముష్టి యుద్ధానికి దిగారు. అనంతరం ఓ కానిస్టేబుల్‌ పోలీసు వాహనంలో నుంచి లాఠీ తీసుకుని ఫైటింగ్‌కి దిగాడు. ఇక చుట్టుపక్కల చేరిన జనం వారిని హెచ్చరిస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. 

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ఫైరయ్యారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణా  చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.  కాగా.. ఇద్దరు పోలీసులను విధుల నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ..


 

మరిన్ని వార్తలు