గర్భగుడిలో నిధి.. తమకే సొంతం అని గ్రామస్తుల పట్టు

14 Dec, 2020 10:04 IST|Sakshi
బయల్పడిన ఆభరణాలు

అధికారుల ఒత్తిడితో అప్పగింత 

సాక్షి, చెన్నై: ఆలయ పునరుద్ధరణ పనుల్లో లభించిన నిధి తమకే సొంతం అని ఉత్తర మేరు గ్రామస్తులు తేల్చారు. ఆ నిధిని అప్పగించాలని అధికారులు పట్టుబట్టినా, గ్రామస్తులు ఏ మాత్రం తగ్గలేదు. కాంచీపురం జిల్లా ఉత్తర మేరు గ్రామంలో పురాతన కులంబేశ్వరర్‌ ఆలయం ఉంది. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులపై గ్రామస్తులు దృష్టి పెట్టారు. గర్భగుడిలో శనివారం తవ్వకాల సమయంలో సాయంత్రం 561 గ్రాములతో కూడిన ఈ బంగారు నగలు బయట పడ్డాయి. బంగారాన్ని ట్రెజరీకి అప్పగించాలని గ్రామస్తులకు కాంచీపురం జిల్లా కలెక్టర్‌ మహేశ్వరి ఆదేశాలు జారీ చేశారు.  ఆ నిధి తమకే సొంతం అని గ్రామస్తులు ప్రకటించారు. దీంతో ఆదివారం కాంచీపురం ఆర్డీఓ దివ్య నేతృత్వంలో బృందం ఆ గ్రామానికి వెళ్లింది. చదవండి: (సీళ్లు సేఫ్..‌ బంగారం ‘ఉఫ్‌’)

గ్రామస్తులను బుజ్జగించి ఆ నిధిని ట్రెజరీకి తరలించేందుకు తగ్గ ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్తులు ఏమాత్రం తగ్గ లేదు. ఆ నిధి తమ గ్రామ ఆలయానికి చెందింది అని, దీనిని ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని తేల్చారు. వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన ఈ ఆలయం చోళుల హయాంలో నిర్మించినట్టు, అయితే, ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో లేదని, వంశపారంపర్యంగా గ్రామ పెద్దలే నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు గ్రామస్తులు తేల్చారు. ఈ నిధి తమ ఆలయానికి సొంతమని, తమ ఆలయానికే ఉపయోగిస్తామని తేల్చడంతో పోలీసుల్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. 

ఒత్తిడితో వెనక్కి...
పోలీసుల్ని రంగంలోకి దించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. తమపై ఒత్తిడి పెరగడంతో గ్రామ పెద్దలు వెనక్కి తగ్గారు. కొందరు అప్పగింతకు వ్యతిరేకించినా, పెద్దలు దిగిరాక తప్పలేదు. అధికారులకు ఓ మెలిక పెట్టారు. నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులు ముగిసినానంతరం  ఆభరణాలు ఆలయానికే అప్పగించాలని, అంత వరకు ట్రెజరీలో ఉండేలా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం అప్పగించారు.    చదవండి: (రజనీ కోసం 28 ఏళ్లుగా ఓటు భద్రం..)

మరిన్ని వార్తలు