జిన్నారం (పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న అల్పన అనే విద్యార్థినిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా అభినందించారు. అందమైన చేతిరాతతో ఇతరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అల్పన రాసిన సందేశం ఉపరాష్ట్రపతిని చేరింది. స్పందించిన ఆయన ‘చక్కని చేవ్రాలుతో మంచి మాటలు, మనసును మరింత హత్తుకుంటాయని, సద్గుణాలు, మానవత్వం గురించి అల్పన తెలుగులో ఎంతో ముచ్చటగా రాసిందని, చిన్న వయస్సులోనే ఇంత చక్కని చేతిరాతను అలవాటు చేసుకున్న ఆ చిన్నారికి అభినందనలు’అని ట్వీట్ చేశారు. దీంతో చిన్నారికి చక్కటి చేతి రాతను నేర్పించిన పైసా సత్యంతో పాటు చిన్నారి అల్పనను పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.
చదవండి: మనకూ బ్రాండ్ ఉండాలి.. సర్కార్ బ్రాండ్తో మార్కెటింగ్