‘భర్త బతికే ఉన్నాడు కదా.. బొట్టు ఎందుకు పెట్టుకోలేదు’ మహిళతో బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు

10 Mar, 2023 18:24 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ మునిస్వామి వివాదంలో చిక్కుకున్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంపీని చిక్కుల్లో పడేశాయి. అసలేం జరిగిందంటే.. ఎంపీ మునిస్వామి మహిళా దినోత్సవం రోజు కోలార్‌ జిల్లాలో ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు.  ఈ క్రమంలో మార్కెట్‌లోని దుకాణాలను పరిశీలిస్తున్న ఎంపీ.. ఓ వస్త్ర దుకాణంలోని మహిళా వ్యాపారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

మహిళను నుదుట బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. మీ భర్త బతికే ఉన్నారుగా అని అంటూనే అ అమ్మాయికి బొట్టు ఇవ్వండి అని ఇప్పిస్తాడు. ‘నీ పేరేంటి? నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీ స్టాల్‌కు వైష్ణవి అని పేరు పెట్టి, బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీకు కామన్‌ సెన్స్‌ లేదా? మీ భర్త ఇంకా బతికే ఉన్నారు కదా. ముందు బొట్టు పెట్టుకోండి’ అంటూ దుర్భాషలాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎంపీ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

మహిళా దినోత్సవం నాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ విరుచుకుపడింది. బీజేపీ దుర్మార్గపు సంస్కృతికి ఈ వీడియో అద్దం పడుతోందని విమర్శించింది. దీనిపై కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ పీ చిదంబరం స్పందిస్తూ..  బీజేపీ భారత్‌ను హిందూత్వ ఇరాన్‌గా మారుస్తుందని మండిపడ్డారు. 
చదవండి: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా?

మరిన్ని వార్తలు