Uttarkashi: ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం

2 Dec, 2023 07:41 IST|Sakshi

ఉత్తరకాశీ జిల్లాలోని మరో సొరంగం స్థానికులను భయానికి గురిచేస్తోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు ఉబికివస్తుండంతో ఇక్కడి సాగునీటి కాలువ, పంట భూములు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇటీవలే కుప్పకూలిన టన్నెల్‌ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని ఉత్తరాఖండ్‌ జల విద్యుత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (యూజేవీఎన్‌ఎల్‌) తెలిపింది. 

ఉత్తరకాశీలోని మనేరి భళి-2 ప్రాజెక్ట్‌లో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తోంది. ధారసులో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంటుంది. ధారసు బ్యాండ్ సమీపంలోని మహర్‌గావ్‌లోని సొరంగం నుండి నీటి లీకేజీ రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇది క్రమంగా పెరుగుతోంది. యూజేవీఎన్‌ఎల్‌ ఇప్పటికే దీని మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయినా లీకేజీ అదుపులోకి రావడం లేదు. 

గత రెండేళ్ల నుంచి ఇక్కడ నీటి లీకేజీ వేగంగా పెరుగుతోందని గ్రామ పెద్ద సురేంద్రపాల్ చెప్పారు.  ఫలితంగా సాగునీటి కాలువ, పలు పంట భూములు దెబ్బతిన్నాయని, పలు చోట్ల భూమి కోతకు గురవుతోందని అన్నారు. ఈ సొరంగానికి తక్షణమే మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. కాగా మనేరి భళి సొరంగం నీటి లీకేజీ నివారణకు మరమ్మతులు  చేస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని యూజేవీఎన్‌ఎల్‌ ఎండీ సందీప్ సింఘాల్ తెలిపారు. 
ఇది కూడా చదవండి: ఇటలీ ప్రధానితో భారత ప్రధాని దోస్తీ చేస్తే..

మరిన్ని వార్తలు