West Bengal: ఆహా ఏమి అదృష్టం! ఉదయం కొన్నాడు.. సాయంత్రానికి జాక్‌పాట్‌ కొట్టాడు!!

12 Dec, 2021 14:15 IST|Sakshi
షేక్‌ హీరా

ఓవర్‌ నైట్‌లో కోటీశ్వరులైపోవాలని కలలు కనని వారుండరేమో ఈ జిందగీలో! కానీ చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. హఠాత్తుగా అదృష్టం వరించి రాత్రికిరాత్రే జాతకం మారిపోతుంది.  అలాంటి వింతొకటి ఓ వ్యక్తి కి తారసపడింది. ఉదయం లాటరీ టికెట్‌ కొన్నాడు సాయంత్రానికి కోటీశ్వరుడైపోయాడు. అదెలాగో మీరే తెలుసుకోండి..

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బార్ధమాన్‌కు చెందిన షేక్‌ హీరా అనే అంబులెన్స్‌ డ్రైవర్‌ ఒక రోజు ఉదయం రూ. 270లతో కోటి రూపాయల జాక్‌పాట్‌ లాటరీ టికెట్‌ కొన్నాడు. అంతే! సాయంత్రానికి అతన్ని అదృష్ట దేవత వరించింది. దీంతో అయోమయానికి గురైన సదరు వ్యక్తి సమీపంలోని శక్తి ఘడ్‌ పోలీస్‌ స్టేషన్‌ను సలహాకోసం ఆశ్రయించాడు. లాటరీ టికెట్‌ పోతుందేమోననే భయం కూడా అతనిలో లేకపోలేదు. పోలీస్‌ అధికారులు అతన్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లి, బయట కొంత మంది పోలీసులను రక్షణగా ఉంచారు కూడా.

నిజానికి అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించుకోవడానికి అతనికి డబ్బు అవసరం చాలా ఉంది. లాటరీని గెలుచుకున్న తర్వాత తన తల్లి త్వరగా కోలుకుంటుందనే ధీమా వ్యక్తం చేశాడు. ‘లాటరీ టికెట్ల ద్వారా ఏదో ఒక రోజు జాక్‌పాట్ కొట్టాలని కలలు కన్నాను. ఇన్నాళ్లకు నా కాల నెరవేరింద’ని సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావని మీడియా అడిగిన ప్రశ్నకు.. తన తల్లికి మంచి వైద్యం చేయించి, ఉండటానికి చక్కని ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. ప్రస్తుతం అంతకు మించి వేరే ఆలోచన ఏమీ లేదని చెప్పాడు.

హీరాకు టిక్కెట్‌ అమ్మిన దుకాణదారుడు షేక్‌ హనీఫ్‌ మాట్లాడుతూ.. ‘ఎన్నో యేళ్లగా లాటరీ టిక్కెట్‌ వ్యాపారం చేస్తున్నాను. చాలా మంది నా షాప్ నుండి టిక్కెట్లు కొంటారు. కొంతమందికి రివార్డ్‌లు అప్పుడప్పుడు దక్కుతాయి. కానీ ఇంత పెద్దమొత్తంలో ఎవరికీ మునుపెన్నడూ తగల్లేదు. నా షాప్‌లో కొన్న టికెట్‌ జాక్‌పాట్‌ కొట్టడం చాలా సంతోషంగా ఉంద’ని తెలిపాడు.

చదవండి: గాడిదపాలు తాగితే కరోనా తగ్గుతుంది! లీటరు రూ. 10వేలు..

మరిన్ని వార్తలు