రాసలీలల కేసులో విచారణకు రండి
యువతికి బెంగళూరు పోలీసుల ఆదేశం
అజ్ఞాతంలో యువతి కుటుంబం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీలో కనిపించిన యువతిని విచారించేందుకు ‘సిట్’ పోలీసులు సన్నద్ధమయ్యారు. ఆదివారం ఆ యువతికి నోటీసులు జారీ చేశారు. విజయపుర (బిజాపుర) జిల్లా నిడగుంది పట్టణంలోని ఆమె ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఇంటికి తాళాలు వేసి ఉంది. అలాగే సదరు యువతి స్నేహితులు, బెంగళూరులో ఆమె ఉంటున్న ఇంటి యజమానులకు కూడా నోటీసులు ఇచ్చి, విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిసింది.
ఇంటి యజమానికి యువతి ఫోన్
బెంగళూరులోని ఆర్టీ నగరలో అద్దె ఇంట్లో ఉంటున్న యువతి రాసలీలల వీడియోలు విడుదలయిన తరువాత గోవాకు వెళ్లిపోయింది. ఆ సమయంలోనే తన ఇంటి యజమానులకు ఫోన్చేసి, తనవల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యాయని, తనను క్షమించాలని కోరినట్లు తెలిసింది. త్వరలో తిరిగి వచ్చి ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పింది. తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని శనివారం యువతి వీడియో విడుదల చేసిన నేపథ్యంలో ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేశామని మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. యువతికి రక్షణ కల్పించాలని హోం మంత్రిని కోరతామన్నారు. ఈ కేసు వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని, ఆత్మహత్యాయత్నం కూడా చేశానని యువతి చెప్పడం ఆందోళనకరమన్నారు.