London: హైదరాబాద్‌ వాలా రెస్టారెంట్‌లో ఎన్నారై యువతిపై కత్తితో దాడి

29 Mar, 2022 12:53 IST|Sakshi

లండన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్న యువతిపై ఓ దుర్మార్గుడు కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడవడంతో ఆ యువతి తీవ్రంగా గాయాలపాలైంది. విషమ పరిస్థితుల మధ్యల లండన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

కేరళాకు చెందిన సోనాబిజు (22) అనే యువతి మాస్టర్స్‌ చదివేందుకు గత నెల లండన్‌ చేరుకుంది. యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌లో చదువుతోంది. అక్కడే ఉన్న హైదరాబాద్‌ వాలా రెస్టారెంట్‌లో వెయిట్రస్‌గా పార్ట్‌టైం జాబ్‌ చేస్తోంది. కాగా 2022 మార్చి 25న ఆమెపై దాడి జరిగింది.

మధ్యాహ్నం 2:20 సమయంలో ఆర్డర్‌ తీసుకునేందుకు ఓ టేబుల్‌ దగ్గరికి వెళ్లగా.. అక్కడ కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా ఆమె మీదకు వచ్చాడు. దగ్గరగా పట్టుకుని కత్తితో పొడవడం ప్రారంభించారు. అడ్డుకునేందుకు అక్కడున్న సిబ్బంది, ఇతర కస్టమర్లు ప్రయత్నించగా వారిని సైతం బెదిరించాడు. ఆ తర్వాత విచక్షణా రహితంగా ఆమె మీద దాడి చేసి అక్కడి నుంచి పరార్‌ అయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించగా దాడికి పాల్పడింది కూడా ఇండియన్‌గానే తేలింది. హైదరాబాద్‌కి చెందిన శ్రీరామ్‌ అంబర్ల (23) అనే వ్యక్తి ఈ దాడి చేసినట్టుగా గుర్తించిన లండన్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. థేమ్స్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో అతడిని హాజరుపరచగా ఏప్రిల్‌ 25 వరకు రిమాండ్‌ విధించారు. కేసు దర్యప్తు సాగుతోంది. మార్చి 19న బ్రిటీష్‌ ఇండియన్‌ సబితా (19) యువతిపై జరిగిన కత్తి దాడి ఘటన మరువకముందే లండన్‌లో మరో దారుణం చోటు చేసుకుంది.
 

మరిన్ని వార్తలు