ఎన్నారైకి రూ.3.11 కోట్ల టోకరా

18 May, 2022 12:18 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో ప్రవాస భారతీయుడిని రూ.3.11 కోట్లకు మోసం చేసిన ఇద్దరిపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు కేసు నమోదు చేశారు.

నగరంలోని పారామౌంట్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌ లండన్‌లో నివసిస్తున్నారు.  వ్యాపార పనుల కోసం ఏటా నాలుగైదుసార్లు సిటీకి వస్తుంటారు. 2013లో వచ్చిన సందర్భంలో రిజ్వాన్, మహ్మద్‌ షోయబ్‌ అనే వ్యక్తులు ఇక్బాల్‌ను కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేలా ఇక్బాల్‌ను ఒప్పించారు. వీరి మాటలతో వివిధ దఫాల్లో ఇక్బాల్‌ డబ్బులిచ్చాడు. 2014 ఏప్రిల్‌ 3న షాద్‌నగర్‌ సమీపంలోని 2 ఎకరాల 4 గంటల స్థలాన్ని విక్రయిస్తామని చెప్పారు. రూ.44 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. 

నగదు ముట్టినప్పటికీ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయకుండా దాటవేస్తూ వచ్చారు. దీంతో బాధితుడు ఆరా తీయగా సదరు స్థలానికి, రిజ్వాన్, షోయబ్‌లకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. రూ.3.11 కోట్ల మేర వారు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు  పేర్కొన్నారు.

చదవండి: నకిలీ ఎన్నారై.. పెళ్లి పేరుతో మోసం..

మరిన్ని వార్తలు