కొనసాగుతున్న ఉత్కంఠ: హస్తినకు అసోం రాజకీయం

8 May, 2021 14:15 IST|Sakshi

ఇంకా కొలిక్కిరాని అసోం సీఎం అభ్యర్థి ఎంపిక

 హిమాంత బిశ్వ శర్మకు  కాంగ్రెస్‌ బంపర్‌ ఆఫర్‌ 

మరింత వేడెక్కిన సీఎం ఎంపిక  కసరత్తు

సాక్షి,ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ మెజార్టీని నిలబెట్టుకున్నప్పటికీ అక్కడ  ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా ప్రతిష్టంభన కొసాగుతోంది.  ఫలితాలొచ్చి అయిదు రోజులైనా సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడలేదు. దీంతో అసోం రాజకీయం హస్తినకు చేరింది. తదుపరి ముఖ్యమంత్రిపై అనిశ్చితి మధ్య నాయకత్వ సమస్యలపై చర్చించడానికి అసోం సిట్టింగ్ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, హిమాంత్ బిశ్వలను బీజేపీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది. కొత్త సీఎం ఎవరనేది శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరువురు నేతలూ ఢిల్లీకి చేరుకుని, బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారు. నడ్డా నివాసంలో  హోంమంత్రి అమిత్ షా,  బీఎల్‌ సంతోష్  సమాశానికి తొలుత హిమంత బిశ్వ శర్మను పిలిపించిన అధిష్టానం శర్వానంద్ సోనో వాల్‌ని కూడా పిలిపించడం విశేషం.  ఈ సమాశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా  హాజరుకానున్నారని తెలుస్తోంది.

హిమంత బిశ్వ శర్మ తనకు 40 మంది ఎమ్మెల్యేలతోపాటు మిత్ర పక్షాల మద్దతు ఉందని అంటుండగా,  సీఎం తన పరిపాలనకే  ప్రజలు ఓటు వేశారని  శర్వానంద్ వాదిస్తున్నారు. అటు 50 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే, హిమాంత బిశ్వ శర్మకు మద్దతుగా నిలుస్తోంది. తమ పార్టీకి చెందిన 29 ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని కాంగ్రెస్ బంపర్‌ ఆఫర్ ఇచ్చింది. దీంతో అనిశ్చిత రాజకీయం వాతావరణం మరింత వేడెకింది. ఈ నేపథ్యంలో నాయకత్వ సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా అధిష్టానం పావులు కదుపుతోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగా అసోంలోని మొత్తం 126 స్థానాలకుగానూ 75 సీట్లలో బీజేపీ నాయకత్వంలోని ఎన్ఏడీ కూటమి విజయం సాధించగా, బీజేపీ 60 సీట్లలో గెలిచింది. ఎన్నికల జరిగిన మిగతా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినా అసోంలో మాత్రం సీఎం ఎంపికపై  ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించని సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు