బీజేపీ ఎంపీ అనుమానాస్పద మృతి

17 Mar, 2021 10:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ అనుమానాస్పద మరణం కలకలం  రేపింది.  హిమాచల్‌ ప్రదేశ్‌ మండికి చెందిన ఎంపీ రామ్ స్వరూప్ శర్మ బుధవారం తన ఇంటిలో శవమై కనిపించారు. అయితే ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు  భావిస్తున్నారు. భార్య చార్‌ధామ్‌ యాత్రలో ఉన్నందున ఢిల్లీలోని నివాసంలో ఆయన ఒంటరిగా ఉన్నారు.  ఇంతలోనే ఆయన అకాలమరణం కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. అటు శర్మ ఆకస్మిక మృతిపై  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ట్విటర్‌ ద్వారా  విచారం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర సీనియర్లు, బీజేపీ శ్రేణులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించాయి. దీంతో ఈ రోజు జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు.  (కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత)

నార్త్ అవెన్యూలోని తన నివాసంలో  రామ్ స్వరూప్ శర్మ  ఉరి వేసుకుని చనిపోయినట్టుగా తమ సమాచారం అందిందని, మృతదేహాన్ని  స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.  సంఘటనా స్థలంలో ఎలాంటి  సూసైడ్ నోటు  ఇప్పటివరకు  లభించలేదన్నారు. విచారణ జరుగుతోందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు బీజేపీ కేంద్ర మాజీమంత్రి దిలీప్‌ గాంధీ ఈ రోజు కరోనాతో కన్నుమూశారు. కాగా 1958 లో హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో జన్మించిన శర్మ 2014 లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో తిరిగి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కూడా పనిచేసిన ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు