ఈడీ, ఐటీలతో కలిసి బీజేపీ పోటీ : ఛత్తీస్‌గఢ్‌ సీఎం

6 Nov, 2023 16:12 IST|Sakshi

రాయ్‌పూర్‌ : బీజేపీని ఈ నెల 17 దాకా ఎంజాయ్‌ చేయనివ్వండని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భగేల్ చమత్కరించారు. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌ లో వచ్చిన ఆరోపణలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశలపై ఏమైనా ప్రభావం చూపుతాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు భగేల్‌ నవ్వుతూ  సమాధానమిచ్చారు.

బీజేపీ ఈ అసెంబ్లీ ఎ‍న్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం లేదని తన మిత్రులు ఈడీ, ఐటీలతో కలిసి పోటీ చేస్తోందని భగేల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎ‍న్నికల పోలింగ్‌ ముందు తమ ప్రభుత్వ ఇమేజ్‌ డ్యామేజ్‌ చేసేందుకే మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్ స్కామ్‌ తెర మీదకు తీసుకువచ్చార‍న్నారు. ప్రభుత్వ ఇమేజ్‌ డ్యామేజ్‌ చేస్తున్న విషయంలో ఎ​న్నికల కమిషన్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అవసరమైతే పార్టీ తరపున ఫిర్యాదు చేస్తామన్నారు. ఈసీ ఈ విషయంలో విచారణ జరపాలని కోరారు. 

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి ప్రస్తుతం ఎన్నికలు  జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. తొలి విడత పోలింగ్‌ మంగళవారం జరగనుంది. రెండవ విడత పోలింగ్‌ ఈ నెల 17న నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు