కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 12 మంది రాజీనామా

19 Dec, 2022 12:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాం‍గ్రెస్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. వలస నేతల వల్ల అస­లైన కాంగ్రెస్‌ నాయకులకు అవకాశం లేకుండా పో­తోందంటూ పలువురు సీనియర్లు శనివారం ఆరోపణలు చేయగా.. అదే రోజున రేవంత్‌ అనుచ­రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాశారు. ఇది ఆదివారం బయటికి వచ్చింది.

రేవంత్‌రెడ్డి అనుచరులుగా పేరున్న పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు సీతక్క (ఎమ్మెల్యే), వేం నరేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సీహెచ్‌ విజయర­మణారావు, దొమ్మాటి సాంబయ్య, వజ్రేష్‌ యాద­వ్, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్య­నారాయణ, పీసీసీ ప్రధాన కార్యదర్శులు సుభాష్‌­రెడ్డి, చారగొండ వెంకటేశ్, పటేల్‌ రమేశ్‌రెడ్డి, సత్తుపల్లి మల్లేశ్, చిలుక మధుసూ­దన్‌రెడ్డి, శశికళ యాదవరెడ్డి రాజీనామా చేసినవారిలో ఉన్నారు. వారు మాణిక్యం ఠాగూర్‌కు రాసిన లేఖలో సీని­యర్ల వ్యవహారశైలిని తప్పుపట్టారు.

లేఖలోని ప్రధానాంశాలు వారి మాటల్లోనే..
‘‘మాకు పదవులు రావడమే నేరం అన్నట్టుగా సీనియర్లు వ్యవహరించడం బాధ కలిగించింది. బీఆర్‌ఎస్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పుడు గెలిపిద్దామా అని చూస్తున్నారు. మనలో మనం విమర్శలు చేసుకోవడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. జనంలో కాంగ్రెస్‌ పట్ల ఉన్న సానుకూలతను చిల్లర రాజకీయాలతో మన­మే పాడుచేసుకుంటున్నామన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్‌ను గద్దెదింపడానికి మేం రేవంత్‌ నేతృత్వంలో పనిచేస్తూనే ఉన్నాం.

రాజకీయ పునరేకీకరణలో భాగంగా తెలంగాణ ఇచ్చిన సోనియా నేతృత్వంలో పనిచేయడమే సరైన వేదిక అనుకున్నాం. రాహుల్‌­గాంధీ ఆహ్వానంతో పార్టీలో చేరాం. సోనియా నేతృత్వంలో పనిచేయడం గౌరవంగా భావించాం. కాంగ్రెస్‌లో చేరిననాటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు, నా­యకత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ వస్తు­న్నాం. ఇదివరకు ఉత్తమ్‌­కు­మార్‌రెడ్డి  నాయక­త్వంలో, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలమన్న స్పృహతోనే వ్యవహరిస్తున్నాం.

వారి వ్యాఖ్యలు బాధించాయి
దేశ ప్రధాని అయ్యే అవకాశాన్ని తృణప్రాయంగా వదిలేసిన సోనియా, భారత్‌ జోడో యాత్ర­తో దేశం కోసం రాహుల్‌ పడుతున్న తపన మా­కు స్ఫూర్తి. మా ఆరేళ్ల సేవలకు గుర్తింపుగా ఏఐసీసీ ఇటీవల మాకు పదవులు ఇచ్చింది. ఈ పదవులు మా బా­ధ్యతను పెంచాయని భావించాం. కానీ ఉత్తమ్‌ నేతృత్వంలో దా­మో­దర రాజన­ర్సింహ, మధుయాష్కీ, తూర్పు జయ­ప్రకాశ్‌రెడ్డి, ప్రేమ్‌­సా­గర్‌­రావు, మహేశ్వర్‌­రెడ్డి, కోదండరెడ్డి తదిత­రు­లు భట్టి విక్రమార్క నివాసంలో సమావే­శమై, తర్వాత మీడియాతో మాట్లాడు­తూ పీసీసీ కమి­టీల్లో సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చిన వారితోనే నింపేశారని ఆరోపణ చేశారు.

ఇది మాకు బాధ కలిగించింది. ఈ పరిణామాలు కా­ర్యకర్తల్లో గందర­గోళానికి కారణం అవుతున్నా­యి. మనమంతా కలిసికట్టు­గా బీఆర్‌­ఎస్‌పై పో­రా­­టం చేయాలని వారు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పదవుల పేరుతో పంచాయితీలు పెట్టుకోవడం పార్టీకి నష్టం చేస్తుంది. సమయం లేదు. అందరం కలిసి బీఆర్‌­ఎస్‌­ను ఓడించాలి. సోనియా రుణం తీర్చుకో­వాలి. లక్ష్యసాధనలో మాకు పదవులు లేకపోవ­చ్చు. కేసీఆర్‌తో పోరుకు మా పదవులే అడ్డంకి అయితే మాకు పదవులు వద్దు. ఈ పేరుతో పార్టీని పలుచన చేయొద్దు. రైతులకు మద్దతు ధర లేదు. రుణ­మాఫీ, పంటలబీమా అందట్లేదు.

కౌలు రైతు­లు ఆత్మహత్యలు చేసుకుంటు­న్నారు. విద్యా­ర్థు­­ల­కు నాణ్యమైన విద్యలేదు. డ్రగ్స్, గంజాయి మ­త్తు­లో యువత చిత్తవుతోంది. బీ­ఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వ, అరాచక పా­లన సాగిస్తున్నది. స్వేచ్ఛ, సా­మా­జిక న్యా­యా­­ని­కి భిన్నంగా పాలన సాగుతోంది. ప్రశ్నించే గొంతు­లను అణచివేస్తూ కేసీఆర్‌ రాజ్యమేలుతు­న్నా­రు. ఈ ప్రభుత్వాన్ని సమైక్యంగా ఎదుర్కోవా­ల్సి­న అవసరం ఉంది’’ అని నేతలు తమ లేఖ పేర్కొన్నారు. 

చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?.. కమిటీల ఏర్పాటు దేనికి సంకేతం!

మరిన్ని వార్తలు