కవ్విద్దాం.. రెచ్చగొడదాం.. 

7 Sep, 2023 04:29 IST|Sakshi

వెలవెలబోతున్న యువగళం కోసం టీడీపీ విధ్వంసక వ్యూహం 

గొడవల ద్వారా ప్రజల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు 

సాక్షి, అమరావతి:  ఎన్ని జాకీలతో పైకి లేపినా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు జనాదరణ రాక­పోవడంతో ఘర్షణలు సృష్టించడం ద్వారా లబ్ధి పొందడానికి తెలుగుదేశం పార్టీ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ ఫ్లెక్సీ కనిపించినా, వైఎస్సార్‌సీపీ జెండా కనిపించినా ఓర్వలేని రీతిలో పాదయాత్రలో టీడీపీ రౌడీలు విధ్వంసం సృష్టిస్తున్నారు. రెచ్చగొడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

లోకేశ్‌ నిర్వహించే సభలు, యాత్ర జరిగే ప్రాంతాల్లో ఇలా వైఎస్సార్‌సీపీ శ్రేణులను కవ్వించడం, రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. తద్వారా ఘర్షణలు చలరేగేలా చేసి పాదయాత్రపై ప్రజల దృష్టి పడాలని కోరుకుంటున్నా­రు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని కవ్వించి, చివరికి వారిపైనే దాడులకు దిగారు.

లోకేశ్‌ బహిరంగ సభ జరిగే ప్రాంతంలో ఉన్న సీఎం జగన్‌ ఫ్లెక్సీపైకి టీడీపీ రౌడీ మూకలు రాళ్లు విసరడం, అడ్డుకున్న పోలీసులను సైతం గాయపరచడం, యాత్ర వెళ్లే రూటులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనా విచక్షణారహితంగా దాడులు చేయడం ద్వారా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. గత కొన్ని నెలలుగా చంద్రబాబు, లోకేశ్‌ యాత్రల సందర్భంగా టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగడం, మళ్లీ తమపైనే దాడులు జరిగాయని ఎదురుదాడి చేయడం పరిపాటిగా మారింది.    

పథకం ప్రకారమే ఉద్రిక్తతలు 
సీఎం జగన్‌ను బూతులు తిట్టడం ద్వారా మీడియా దృష్టిలో పడేందుకు లోకేశ్‌ నోటికి పనిజెప్పారు.  యాత్ర జరిగే ప్రాంతాల్లో అధికార పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు చింపి వేయించడం ద్వారా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఏవైనా సూచనలు చేస్తే పోలీసులతో గొడవలకు దిగడం నిత్యకృత్యంగా మారింది. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం తన వెనుక ఉన్న అల్లరి మూకల ద్వారా లోకేశ్‌ చేయిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

మరిన్ని వార్తలు