గజ్వేల్‌ ఓటమితో ఇంకా కసి పెరిగింది: ఈటల రాజేందర్‌

14 Dec, 2023 16:57 IST|Sakshi

సాక్షి, గజ్వేల్‌:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గంలో ఓటమి.. తనలో ఇంకా కసి పెంచిందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఆయన గురువారం గజ్వేల్‌ నియోజకవర్గం బీజేపీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈటల రాజేందర్‌ తన ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో డబ్బు, మద్యం పంపిణీ చేసి మాజీ సీఎం కేసీఆర్‌ గెలిచారని ఆరోపించారు.

గజ్వేల్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించానని తెలిపారు. గజ్వేల్‌లో నైతికంగా బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదని మండిపడ్డారు. స్థానిక నేతలను భారీ మొత్తానికి కొని కేసీఆర్‌.. గజ్వేల్‌లో  గెలిచారని ఆరోపించారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు తనకు ఓటమి తెలియదని అన్నారు.

గజ్వేల్‌లో ఓటమి తనలో ఇంకా కసి పెంచిందని రాజేందర్‌ తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు​ చోట్ల టిక్కెట్‌ దక్కించుకున్న ఈటల రాజేందర్‌.. ఆ రెండు​ చోట్ల ఓడిపోవడం గమనార్హం. గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీర్‌ చేతిలో ఓడిపోగా.. తనకు కంచుకోట లాంటి హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.   

చదవండి: ఉన్న వనరుల్నే వాడుకుంటాం : సీఎం రేవంత్‌

>
మరిన్ని వార్తలు