విద్య కన్నా భూ దాహమే ఎక్కువ

27 Oct, 2020 03:31 IST|Sakshi

హైకోర్టు ఆర్డర్‌ను వక్రీకరించి సానుభూతి కోసం తాపత్రయం

పేదవాడికి ‘గీతం’లో ఒక్క సీటు ఇచ్చిన దాఖలాలు లేవు

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

మద్దిలపాలెం (విశాఖ): విద్యా దానం కన్నా..  గీతం యూనివర్సిటీలో భూ దాహమే ఎక్కువని హైకోర్టు వ్యాఖ్యలు చేసిన విషయం వాస్తం కాదా..అని, సొంత భూమి 30 ఎకరాలున్నా దాన్ని రియల్‌ ఎస్టేట్‌ కోసం దాచుకుని ప్రభుత్వ భూమి 40 ఎకరాలకు పైగా దోచుకోవాలని ‘గీతం’ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాల్ని ప్రభుత్వం అడ్డుకుందని, దీన్ని ప్రజలు హర్షిస్తూ స్వాగతిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. గీతం వర్సిటీపై చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రేమ ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం కరెక్టేనా అని ప్రశ్నించారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే..

► తప్పులు చేసి కూడా సానుభూతి పొందాలనుకునే దిక్కుమాలిన ఆలోచన టీడీపీకి మాత్రమే వస్తుంది.
► ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గీతం యాజమాన్యం ఆక్రమించుకున్న రూ.800 కోట్లపై చిలుకు విలువైన 40 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై గీతం యాజమాన్యం కోర్టుకెళ్లగా.. కోర్టు తాత్కాలికంగా ఒక ఆర్డర్‌  ఇస్తే.. దానిని కూడా వక్రీకరిస్తున్నారు. టీడీపీ, వారి అనుకూల మీడియా ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
► గీతం వేసిన రిట్‌ పిటిషన్‌లోనే అది ప్రభుత్వ భూమి అని ఉంది. ఇంతకన్న రుజువు ఇంకేం కావాలి?
► గీతం యాజమాన్యం 2020 ఆగస్ట్‌ 3న ఎండాడ గ్రామ పరిధిలో గల 43 ఎకరాల ప్రభుత్వ భూమిని తమకు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసింది. దీని అర్థం ఆ భూమి వారిది కాదనేగా..! 

మరిన్ని వార్తలు