-

కాంగ్రెస్‌తో కష్టాలు తెచ్చుకోవద్దు

27 Nov, 2023 04:07 IST|Sakshi

మంత్రి హరీశ్‌రావు 

ఆ పార్టీ వస్తే స్కాములు, కర్ఫ్యూలు తప్పవు 

మణికొండ, దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ తరపున మంత్రి ప్రచారం 

మణికొండ/దుబ్బాకటౌన్‌: రాష్ట్రంలో కంటికి కనిపించే అభివృద్ధి, ఇంట్లోకి వస్తున్న సంక్షేమ పథకాలను కాదని, ఏరికోరి కాంగ్రెస్‌ పాలన తెచ్చుకుని కష్టాల పాలు కావద్దని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఏ కోశానాలేదని, ఒకవేళ వస్తే విద్యుత్‌ కోత లు, బిల్డర్‌ల వద్ద కర్ణాటకలో మాదిరిగా చదరపు అడుగుకు రూ.80లు వసూలు, స్కాములు, కర్ఫ్యూ లు తప్పవని అన్నారు.

రైతులకు రైతుబంధు, బీ మా, బీసీబంధు, దళితబంధు, ఇంటింటికి తాగునీ రు, 24గంటల విద్యుత్, శాంతి భద్రతలు, ప్రభుత్వ ఆసుపత్రులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, న్యూ ట్రిషన్‌ కిట్‌లు ఇస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మా ర్చాల్సిన అవసరం ఎందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మíßహిళకు గృహలక్ష్మి, రూ.400లకే గ్యాస్‌ సిలిండర్, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్యబీమా, మరో లక్ష డబుల్‌బెడ్‌రూం గృహాలను ఇస్తామని హామీ ఇచ్చారు.

మరో మూడు రోజులు మాత్రమే ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కనిపిస్తారని, ఎన్నికలు ముగియగానే వారంతా ఢిల్లీ బాట పడతారని, ఇక్కడ ఉండేది ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లు మాత్రమే గెలిచిందని, అక్కడి ప్రజలు ఆ పార్టీని నమ్మలేదని, అలాంటిది రాహుల్, ప్రియాంకలు ఇక్కడకు వచ్చి గొప్పలు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. వారిని నమ్మి మోసపోవద్దని హరీశ్‌రావు కోరారు.

వారికి దమ్ముంటే ఇప్పుడు బెంగళూరు ప్రజలతో సమావేశం పెట్టాలని సవాల్‌ విసిరారు. రాబోయే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్‌ నగరం చుట్టూ నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, మణికొండ, శంషాబాద్‌లకు వంద పడకల ఆసుపత్రులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, మన రాష్ట్రం, మన పాలనకే ప్రజలు పట్టం కట్టాలని.. ఢిల్లీ పార్టీలను తరమికొట్టాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్రంలో మరో మారు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అన్నారు.  

కేంద్రం రూ.28 వేల కోట్లు ఎగ్గొట్టింది..  
రైతుల బోరు బావుల వద్ద కరెంట్‌ మీటర్లు పెట్టక పోవడంవల్ల తెలంగాణకు రావాల్సిన రూ.28 వేల కోట్లను కేంద్రం ఎగ్గొట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్, రాష్ట్రంలో 11 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని, పొరపాటున కాంగ్రెస్‌ వస్తే మళ్లీ చీకటి కష్టాలు వస్తాయని అన్నారు.  

మరిన్ని వార్తలు