కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసనలు

24 Nov, 2023 16:17 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూలు: కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలతో వచ్చి కొల్లాపూర్‌ పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, సమాచారం ఇచ్చిన వారిని కొల్లాపూర్ ఎస్సై అతి దారుణంగా కొట్టారని వారు ఆరోపించారు. కొల్లాపూర్ మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్, ముక్కిడి గుండం మాజీ సర్పంచ్ లోకేష్ యాదన్‌ను ఎస్సై అతి దారుణంగా కొట్టారని జూపల్లి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డైరెక్షన్‌లోనే పోలీసులు పనిచేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. 

పోలీసులు అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీరియస్‌ అయ్యారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని బెల్టులతో కొట్టారని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీని కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అంటూ ప్రశ్నించారు. 
 

మరిన్ని వార్తలు