కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తే చేతికి చిప్పే

12 Sep, 2023 02:02 IST|Sakshi
కేంద్రమంత్రి రూపాలకు పుష్పగుచ్ఛం అందిస్తున్న పులిమామిడి రాజు. చిత్రంలో ఈటల, కిషన్‌రెడ్డి, రఘునందన్‌ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ధనికరాష్ట్రంగా ఉన్న తెలంగాణ కేసీఆర్‌ పాలనలో పూర్తిగా దివాలా తీసిందని.. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి దిగజారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. మళ్లీ కేసీ ఆర్‌ను గెలిపిస్తే ప్రజల చేతికి చిప్పే మిగులుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా సంగా రెడ్డిలోని అంబేడ్కర్‌ స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభలో ఆయన ప్రసంగించారు.

ప్రభుత్వం వద్ద డబ్బులు లేక మద్యం టెండర్లు 6 నెలలు ముందు నిర్వహించిందని,  ఓఆర్‌ఆర్‌ టెండర్లతో వచ్చిన డబ్బులతో జీతా లు చెల్లించాల్సి వస్తోందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల తీరును ఆయన తీవ్రంగా విమ ర్శించారు. కాంగ్రెస్‌ సోని యా కుటుంబం కోసం..బీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ కుటుంబం కోసం..ఎంఐఎం ఒవైసీ కుటుంబం కోసం పనిచేస్తాయని చెప్పారు. ఒక్క బీజేపీ మాత్రమే అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందనే విషయం ప్రజలు గుర్తించాలన్నారు.

సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.పది లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు దేశంలోని అన్ని పార్టీల ఖర్చులను తానే భరిస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పారని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు బీసీలపై నమ్మకం లేదు: ఈటల
బీఆర్‌ఎస్‌ ఉన్నంత వరకు ఆ పార్టీకి సాధారణ వ్యక్తి అధ్యక్షుడిగా ఉండే ఆస్కారం ఉంటుందా అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌కు బీసీలపై నమ్మకం లేకనే మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను కూడా తన అన్న కొడుక్కే కట్టబెట్టారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఉన్నంత వరకు కేసీఆర్‌ కుటుంబసభ్యులు మినహా ఇతరులు సీఎం కాలేరని, కేసీఆర్‌ కాకపోతే ఆయన కొడుకు.. మనవడే ముఖ్యమంత్రి అవుతారని, సాధారణ వ్యక్తులు సీఎం కాలేరని అన్నారు. సభలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల,  ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు