రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 'వైఎస్సార్‌ పంటల బీమా'

27 May, 2021 04:16 IST|Sakshi

రైతులతో రాజకీయం చేయడం సిగ్గు అనిపించలేదా చంద్రబాబూ

మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతోందని.. ఈ పథకంలో ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. పథకం కింద రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోందని చెప్పారు. వ్యవసాయ బడ్జెట్‌ విషయంలో చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు, అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బడ్జెట్‌ను గత ప్రభుత్వం ఎలా రూపొందించిందో, ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ప్రవేశపెడతాయో ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిందన్నారు. అయితే, చంద్రబాబు మాత్రం తాను గొప్పగా ఏదేదో చేసినట్టు, ఈ ప్రభుత్వం ఏమీ చేయనట్టు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను కేవలం గైడ్‌లైన్స్‌ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుందన్నారు. ఆ నిబంధనలకు లోబడి ప్రభుత్వమే సొంతంగా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోందని స్పష్టం చేశారు. 

రెండేళ్లలో రూ.3,783.25 కోట్లు చెల్లించాం
రెండేళ్ల కాలంలో పంటల బీమా కింద రూ.3,783.25 కోట్లను రైతులకు పంట నష్టపరిహారంగా చెల్లించామని మంత్రి కన్నబాబు వివరించారు. కోవిడ్‌ కష్టకాలంలోనూ ఒకేరోజు రూ.1,820 కోట్లను పంటల బీమా కింద విడుదల చేయడం రికార్డని తెలిపారు. ఒక్క నెలలోనే రైతుల ఖాతాల్లో రూ.5,800 కోట్లు జమ చేసిన ప్రభుత్వం దేశంలో ఒక్క వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమేనన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వని క్లైములకు సంబంధించి దాదాపు రూ.715.84 కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక చెల్లించామన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్లలో దాదాపు రూ.83 వేల కోట్ల సాయాన్ని వివిధ రూపాల్లో రైతులకు అందచేసిందన్నారు. 

చంద్రబాబుకు కడుపుమంట
వ్యవసాయం దండగన్న చంద్రబాబు అడ్రస్‌ గల్లంతైందన్నారు. రైతులను మోసం చేసినందుకే చంద్రబాబును చిత్తుగా ఓడించారన్నారు. ఇంకా రైతులతో రాజకీయం చేయడం చంద్రబాబుకి సిగ్గు అనిపించటం లేదా అని నిలదీశారు. పంటల బీమాను చంద్రబాబు కంటితుడుపు చర్యగా చూపించే ప్రయత్నం చేయడం ఆయన దిగజారుడు, దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. తాను ఇవ్వలేనివి సీఎం జగన్‌ క్రమం తప్పకుండా ఇస్తున్నారన్న కడుపు మంటతో ఇలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.  

మరిన్ని వార్తలు