‘లోతుగా విచారిస్తే బాబుల స్కాం బయటపడుతుంది’

21 Mar, 2023 16:08 IST|Sakshi

తాడేపల్లి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం టీడీపీ హయాంలోనే జరిగిందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు  నైపుణ్యతకు స్కిల్‌ స్కాం ఓ ఉదాహరణ అని అమర్నాథ్‌ విమర్శించారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ కేంద్రంగా పరిశ్రమల ఏర్పాటు వల్ల అక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవసరం పెరిగిందన్నారు.

ఒక ప్రైవేట్‌ సంస్థ 90 శాతం నిధులను ఎందుకు కేటాయిస్తుందనే అనుమానం ఎవరికైనా వస్తుందని, యూరో లాటరీల మాదిరిఆ టీడీపీ హయాంలో షెల్‌ కంపెనీలతో కలిసి సింగపూర్‌ కేంద్రంగా స్కాం జరిగిందన్నారు. సీమెన్స్‌ సంస్థకు లేఖ రాస్తే అంత తక్కువ పెట్టుబడికి అంత ఎక్కువ ఎలా పెడతామని సమాధానం ఇచ్చారన్నారు.  డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ. 185 కోట్ల సింగిల్‌ ట్రాన్స్‌ఫర్‌ జరిగిందన్నారు. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిధులు మంజూరు చేస్తున్నట్లు  ప్రిన్పిపల్‌ సెక్రటరీ స్వయంగా జీవో విడుదల చేశారన్నారు.

అప్పటి ఏలేరు స్కాంలో చంద్రబాబు పాత్ర అందరికీ తెలుసని, స్టాంప్‌ల కుంభకోణంలోనూ చంద్రబాబు హస్తం బయటపడిందన్నారు.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం దేశంలోనే అతి పెద్ద స్కాం అని, స్కిల్‌ స్కాంలో చంద్రబాబు, లోకేష్‌ అరెస్టు కావాల్సి ఉందన్నారు. దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే బాబుల స్కాం బయటపడుతుందన్నారు. బాబుకి అవినీతిలో నోబుల్‌, మోసం చేయడంలో ఆస్కార్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు