బలమైన కాంగ్రెస్ లేకుండా అది అసాధ్యం.. జైరాం రమేశ్ కీలకవ్యాఖ్యలు

12 Sep, 2022 18:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల ఐక్యత అంటే కాంగ్రెస్‌ను బలహీనం చేయడం కాదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే విషయంపై స్పందించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.

తన ఉద్దేశంలో విపక్ష పార్టీలన్నీ కలవడం అంటే కాంగ్రెస్‌ను బలహీనపర్చడం కాదని జైరాం రమేశ్ అన్నారు. బలమైన కాంగ్రెసే విపక్ష కూటమికి మూలస్తంభం అన్నారు. తమను ఇంకా బలహీనపర్చాలని చూస్తే అనుమతించే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని మిత్రపక్షాలు అర్థం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ తనను తాను పటిష్ఠం చేసుకోగలదని స్పష్టం చేశారు.

ఏనుగు నిద్రలేచింది
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి బీజేపీ కంగుతింటోందని జైరాం రమేశ్ అన్నారు. ఇది ప్రధాని మన్‌ కీ బాత్‌లా కాదు ప్రజా సమస్యలను లేవనెత్తే యాత్ర అన్నారు.  ఈ యాత్రతో ఏనుగు మేల్కొందని అందరికీ అర్థమయ్యిందని, ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతోందన్నారు.  కాంగ్రెస్ ఏం చేస్తుందో అన్ని పార్టీలు చూస్తున్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకే భారత్ జోడో యాత్ర చేపడుతున్నట్లు జైరాం రమేశ్ స్పష్టం చేశారు. అయితే ఈ యాత్ర వల్ల విపక్షాల్లో ఐక్యత వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు.
చదవండి: కాంగ్రెస్‌ షేర్‌ చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ నిక్కర్‌ ఫోటోపై తీవ్ర దుమారం

మరిన్ని వార్తలు