ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం!

18 Jul, 2021 11:03 IST|Sakshi

తాండూరు రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. కొంతకాలంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వీరిద్దరు టీఆర్‌ఎస్‌ పార్టీనే అయినా వైరం నడుస్తోంది. ఈనేపథ్యంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి గులాబీ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ఆయన ఖండించారు. వైరి వర్గం కావాలనే ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 

తాండూరు: టీఆర్‌ఎస్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నా యి.మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తో పాటు మరికొందరు టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు త్వరలో ‘కారు’దిగి ‘చేయి’ అందుకుంటారని ఆయన వైరివర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. పొమ్మన లేక పొగపెడుతున్నట్లు అనే చందంగా వ్య వహరిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్‌రెడ్డి బలమైన నేతగా ఎదిగారు. కొంతకా లంగా జరుగుతున్న ప్రచారంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నా రు. మహేందర్‌రెడ్డి పార్టీ మారితే పట్నం కుటుంబసభ్యులంతా కారు దిగే అవకాశాలు లేకపోలేవు.  

అంతటా ఇదే చర్చ..
జిల్లాలోని తాండూరు నియోజకవర్గ రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పక్షం రోజులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కారు దిగుతున్నారని సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ముఖ్యనేతలు ఒకచోట కలిసినప్పుడు ఇదే విషయాన్ని చర్చించుకుంటూ కనిపిస్తున్నారు. మహేందర్‌రెడ్డి 2014లో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌ బలహీనంగా ఉంది. అలాంటి సమయంలో మహేందర్‌రెడ్డి పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ సైతం పలు బహిరంగ సభలో ప్రశంసించారు. తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగిన నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.  

పైలెట్‌ పార్టీ మారడంతో.. 
తాండూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నికైన పైలెట్‌ రోహిత్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే ఆయన జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో వెనుకబడ్డారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన రాజకీయ గురువు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. కొన్నిరోజులకు రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి కారెక్కారు. అనంతరం మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి కొన్నాళ్ల పాటు సన్నిహితంగా మెలిగారు. తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని ఓ సొంత కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలంగా ఇదరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటున్నాయి. కొన్నిసార్లు వీరిద్దరు పాల్గొన్న సమావేశాల్లో  అనుచరులు గొడవపడి కొట్టుకున్నారు.   

పట్నం పార్టీ మారితే .. 
ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కారు దిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన సోదరుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సతీమ ణి సునీతారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గొ కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వీరి హవా ఉంది. ఒకవేళ వీరంతా  పార్టీ మారితే గులాబీదళానికి నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.   

పట్నం పోటీలో లేకుండా..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ ని యోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు టీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అధిష్టానం వద్ద ప్రాభవం కోల్పోయారని వైరి వర్గం ప్రచారం చేస్తోంది. రోహిత్‌రెడ్డికే టికెట్‌ కేటాయిస్తారని అంటున్నారు. మహేందర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ప్రచారం సాగిస్తోంది.   

నాపై విష ప్రచారం..
నేను టీఆర్‌ఎస్‌ను వీడి వెళుతున్నానని వైరివ ర్గం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విష ప్రచారానికి తెరతీశారు. నేను టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతాను. తప్పుడు ప్రచారం చేస్తున్న వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేద్దాం. 
– పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

మరిన్ని వార్తలు