పవన్‌కు ఎందుకంత కడుపుమంట?

21 Oct, 2023 10:42 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం సీబీఎస్‌ఈ  టోఫెల్ , ఐబీ  సిలబస్ ఎందుకు? ఇది నిన్న పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యున్నత సిలబస్‌ను అందించడంపై తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు పవన్‌.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యలో రాష్ట్ర సిలబస్‌ను బోధిస్తున్నారు. దీని వల్ల సాంప్రదాయ విద్యాబోధన అందుతోంది. అయితే మారిన పరిస్థితులు, పోటీ ప్రపంచంలో భాగంగా ప్రైవేట్‌ స్కూళ్లు అన్నీ కొత్త సిలబస్‌ను ఎంచుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే CBSE అంటే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ను ఎక్కువ శాతం ప్రైవేట్‌ స్కూళ్లు ఎంచుకున్నాయి. ఇక మరికొన్ని కార్పోరేట్‌ స్కూళ్లు IB సిలబస్‌ అంటే ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌.. (దీన్నే లాటిన్‌ నామంలో The International Baccalaureate® (IB) గా పిలుస్తారు) ఎంచుకున్నాయి.

సాధారణంగా.. డబ్బున్న కుటుంబాలకు చెందిన పిల్లలు ఇప్పుడు IB సిలబస్‌ను మాత్రమే ఎంచుకుంటున్నారు. దీంట్లో చదవడం ద్వారా విద్యార్థులకు ప్రపంచ అవగాహన కలగడంతో పాటు భవిష్యత్తులో సులభంగా అంతర్జాతీయ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందగలుగుతారు. అలాగే అక్కడి కరిక్యులమ్‌కు అనుగుణంగా సులభంగా మారిపోగలరు. దీని విశిష్టతను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి IB సిలబస్‌ను ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

పవన్‌ కల్యాణ్‌కేంటీ అభ్యంతరం
పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తే.. ఆ కుటుంబ భవిష్యత్తుకు ఎంతో భరోసా. ఉన్నత చదువులు ఎక్కువ మంది చదువుకోగలిగితే.. సమాజం అభివృద్ధి చెందుతుంది. డబ్బున్నవాళ్లే కాదు.. పేదవాడు కూడా చదువుకోవడం.. ఇప్పుడు చాలా మంది ఓర్వలేకుండా ఉన్నారు. ఐబీ సిలబస్‌ను ఉచితంగా పేద విద్యార్థికి ఎలా అందిస్తారన్న కడుపు మంట ఈ వ్యాఖ్యల్లో బయటపడుతోంది. తమ పిల్లలను ఇంటర్నేషనల్‌ స్కూళ్లకు మాత్రమే పంపే ఈ నియో రిచ్‌ నాయకులు.. పేదలకు మాత్రం ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 

తెలుగు భాష మీద నెపం మోపుతారా?
తెలుగు భాష అమ్మ అయితే ఇంగ్లిష్‌ భాష నడిపించే నాన్న. మారిన ప్రపంచీకరణ వల్ల జీతం, జీవితం ఇంగ్లిష్‌పై ఆధారపడుతోంది. ఇటీవల ఐక్యరాజ్యసమితికి వెళ్లిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చూసి యావత్తు దేశం అబ్బురపడింది. అంతర్జాతీయ యవనికపై వారి భాష, ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం ఏపీ ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్యకు అద్దం పట్టింది.

ఇప్పుడు పిల్లలంతా చదువుకుని ప్రయోజకులయితే తమ సంగతి ఏంటన్న ఆందోళనలో పచ్చపార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. హఠాత్తుగా వీరికి తెలుగుభాష మీద ప్రేమ పుట్టింది. తెలుగులో చదువుకోకపోతే ఎలా అంటూ దీర్ఘాలు తీస్తున్న వీరి అసలు ఉద్దేశ్యం మాత్రం కడుపు మంటే. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు.. చైనా విద్యాసంస్థలను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరూ చేరకుండా చేశాడు. ఇప్పుడు పేదవాడు బాగుపడుతున్నాడంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లలకు  మనమిచ్చే నిజమయిన  ఆస్థి విద్య అని భావించిన సీఎం జగన్ ప్రభుత్వం 70 వేల  కోట్లు ఖర్చు చేసింది. అందుకే ఐబీ అయినా టోఫెల్‌ అయినా ప్రతీ సామాన్యుడికి అందాలన్న ఆశయం దిశగా అడుగులేస్తోంది.

మరిన్ని వార్తలు