‘ఏకగ్రీవాలను అప్పుడు ఎందుకు తప్పు పట్టలేదు?’

27 Jan, 2021 20:06 IST|Sakshi

నిమ్మగడ్డపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఫైర్‌

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏకగ్రీవాలు ఎక్కువ అయితే వాటిని వ్యతిరేకిస్తానన్నట్టుగా నిమ్మగడ్డ చెప్పడం రాజకీయం కాదా.. అసలు ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే నిమ్మగడ్డ ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి. ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడ ఉందో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ చెప్పాలి. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానా ప్రకటించడం అన్నది దశాబ్దాలుగా ఉంది. ఆ ప్రక్రియను తప్పు బట్టదలచుకుంటే టీడీపీ హయాంలో ఎందుకు తప్పుబట్టలేదు. అప్పుడు ఎన్నికలు ఎందుకు జరపలేదు. అప్పటికే ఉన్న జీవో మీద కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. నామినేషన్లు వేయకముందే నిమ్మగడ్డ ఎందుకు ప్రెస్‌మీట్లో దాని మీద మాట్లాడాల్సి వచ్చింది’’ అని ప్రశ్నించారు.
(చదవండి: ఏకగ్రీవాలతో గ్రామ స్వరాజ్యం)

‘‘పంచాయతీ ఎన్నికలనేవి పార్టీలకు అతీతంగా.. వాటి ప్రమేయం లేకుండా.. గుర్తులకు సంబంధం లేకుండా జరుగుతాయని తెలిసి కూడా.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పలానా పార్టీకి అనుకూలంగానూ, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగానూ జరుగుతాయనే అభిప్రాయాన్ని కలిగించేలా నిమ్మగడ్డ మీడియా సమావేశంలో మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం. ఇంతకుముందు రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ఎన్నికల కమిషనర్‌ అయినా నిమ్మగడ్డ మాదిరిగా ఇలా మాట్లాడారా. ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏనాడైనా తలెత్తిందా. పంచాయతీల్లో ఏకగ్రీవాలపై అటు చంద్రబాబు, ఇటు నిమ్మగడ్డ ఒకే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వెనుక కారణాలు ఏంటి. పరిమితులకు లోబడే ఏకగ్రీవాలు ఉండాలంటూ... నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో... ఏ చట్టంలో ఇది రాసి ఉందో ఆయన వెల్లడించగలరా’’ అంటూ రామచంద్రారెడ్డి వరుస ప్రశ్నలు కురిపించారు.
(చదవండి: ఆ ఇద్దరి బదిలీకి ఎస్‌ఈసీ ‘నో’)

‘‘ఏ చట్టంలో లేని వ్యవహారాన్ని నిమ్మగడ్డ ఒక ఉద్దేశంతో చెప్తున్నారు కాబట్టి ఆయన్ను ప్రశ్నించాల్సి వస్తోంది. పార్టీలకు సంబంధంలేని ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి, అధికార పార్టీకి దురుద్దేశాలను అంటగట్టేలా మాట్లాడ్డం దేనికి నిదర్శనం. ఏకగ్రీవ ఎన్నికలకు నజారానా ఇస్తూ, దశాబ్దాలుగా ఉన్న నియమ నిబంధనలను జీవోల ఆధారంగా స్పష్టం చేస్తూ ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రకటనను తప్పుబట్టడం కూడా నిమ్మగడ్డ రాజకీయాల్లో భాగం కాదా. అధికారులతో ఎలాంటి సమస్యాలేదంటూనే.... తనకన్నా మెరుగైన స్థితిలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా, ఏకంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి అవార్డు పొందిన అధికారికి నిబంధనలు, నియమాలు తెలియవన్నట్టుగా, అసమర్థుడు అన్నట్టుగా కించపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంలో భాగం కాదా. పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజా శంకర్‌లను తొలగించాలంటూ ముందు సీఎస్‌కు లేఖ రాసి, తర్వాత లేదు అది నా ఉద్దేశం కాదంటూ మరో లేఖ అదే రోజు రాసి, మరుసటి రోజు వారిని అభిసంశిస్తూ మరో లేఖ రాసి, ఈమేరకు డీఓపీటికి కూడా లేఖ రాసి.. ఇవాళ మీడియా కాన్ఫరెన్స్‌లో తాను ఏమీ చేయలేదంటూ కక్షసాధించలేదంటూ నిమ్మగడ్డ చెప్పుకోవడం... ఇది చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడల్లో భాగం కాదా. వ్యవస్థలను సవ్యంగా, నిష్పక్షపాతంగా నడిపించాల్సిన వ్యక్తి ఇన్ని దురాగాతాలకు పాల్పడుతుంతే.. ఇక ఎన్నికల కమిషనర్‌ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లిపోవా’’ అని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు