యూపీలో పొత్తులపై ఇప్పుడే చెప్పలేం: ప్రియాంక గాంధీ

19 Jul, 2021 04:45 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు. అయితే, ఆ విషయంలో సానుకూలంగానే ఉన్నామని, తమ లక్ష్యం బీజేపీని ఓడించడమేనని స్పష్టం చేశారు.   రాష్ట్రంలో మీరు ఉన్న సమయంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలంగా ఉంటారని, మీరు వెళ్లిన వెంటనే మళ్లీ పార్టీ స్తబ్దుగా మారుతుందని వ్యాఖ్యకు స్పందిస్తూ.. ‘నేను ఇక్కడ ఉన్నప్పుడు మీ(మీడియా) అటెన్షన్‌ ఉంటుంది. కనుక క్రియాశీలంగా ఉన్నట్లు మీకు కనిపిస్తుంది. నేను లేని సమయంలో మాపై మీ దృష్టి ఉండదు. కనుక స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి’ అని వివరించారు.  2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా అన్న ప్రశ్నకు.. ఇప్పుడే చెప్పలేమని సమాధానమిచ్చారు.  యూపీకి ప్రియాంక పొలిటికల్‌ టూరిస్ట్‌ అన్న బీజేపీ విమర్శలపై స్పందిస్తూ.. తనను, సోదరుడు రాహుల్‌ని సీరియస్‌ రాజకీయవేత్తలు కాదని ప్రచారం చేయడం బీజేపీ ఎజెండా అన్నారు.

మరిన్ని వార్తలు