యే క్యా హై మోదీజీ.. వాళ్లకోసం ఏమైనా చేస్తారు.. సీనియర్ సిటిజెన్లకు రాయితీ ఇ‍వ్వలేరా?

22 Jul, 2022 19:16 IST|Sakshi
రాహుల్ గాంధీ

సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. ఇకపై సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో రాయితీ ఉండదని కేంద్రం పార్లమెంటులో ప్రకటించిన మరునాడే ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 

'ప్రకటనల కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రధానికి కొత్త విమానం కొనుక్కోవడానికి డబ్బులుంటాయి.  పారిశ్రామిక రంగంలోని స్నేహితులకు పన్ను రాయితీలు చేస్తున్న ప్రభుత్వం వద్ద దేశంలోని సీనియర్‌ సిటిజెన్లకు రైలు టికెట్లలో రాయితీ కోసం 1500 కోట్లు లేవా?  కేంద్రం తన స్నేహితుల కోసం ఆకాశం నుంచి నక్షత్రాలైనా తీసుకొస్తుంది కానీ ప్రజలను మాత్రం రూపాయి కోసం  కష్టపడేలా చేస్తుంది' అని రాహుల్ ధ్వజమెత్తారు.

2020 వరకు సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో 50శాతం వరకు రాయితీ ఇచ్చేది కేంద్రం. కానీ కరోనా  కారణంగా దాన్ని నిలిపివేసింది. అయితే ఇకపై కూడా రాయితీ ఇచ్చే ఆలోచన లేదని బుధవారం పార్లమెంటు వేదికగా వెల్లడించింది. అలా చేస్తే రైల్వేకు నష్టాలు వస్తాయని తెలిపింది. క్రీడాకారులకు కూడా ఇకపై రాయితీ ఉండబోదని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ రాహుల్‌ ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు.
చదవండి: సావర్కర్‌ కాదు భగత్‌ సింగ్ వారసులం.. అరెస్టులకు భయపడం: కేజ్రీవాల్‌

మరిన్ని వార్తలు