Rajasthan Elections 2023: ఐదేళ్లుగా పరస్పరం రనౌట్‌కు కుట్రలు

20 Nov, 2023 05:00 IST|Sakshi

రాజస్తాన్‌ కాంగ్రెస్‌ నేతల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా 

అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే కాంగ్రెస్‌ సంప్రదాయం 

రాజస్తాన్‌లోని చురు జిల్లాలో మోదీ ఎన్నికల ప్రచారం  

జైపూర్‌: దేశమంతటా ఎక్కడ చూసినా క్రికెట్‌ ప్రపంచకప్‌ ముచ్చట్లే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ తీరును క్రికెట్‌ టీమ్‌తో పోల్చారు. రాజస్తాన్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఒకరినొకరు రనౌట్‌ చేసుకొనేందుకు గత ఐదేళ్లుగా కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. తద్వారా ఆ పారీ్టలో నేతల మధ్య రగులుతున్న అంతర్గత విభేదాలను, సీఎం అశోక్‌ గహ్లోత్, సీనియర్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ మధ్య ఆధిపత్య పోరును ప్రస్తావించారు.

వారు పరుగులు చేయడానికి బదులు, సొంత టీమ్‌లోని ప్రత్యర్థులను పడగొట్టాలని చూశారని చెప్పారు. వారి టీమ్‌ సరిగ్గా లేనప్పుడు ఇక ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆదివారం రాజస్తాన్‌లోని చురు జిల్లాలోని ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు అనే సంప్రదాయాన్ని కాంగ్రెస్‌ అభివృద్ధి చేసిందని, దాని వల్ల దేశం భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ తీరు వల్ల దేశంలో యువతకు ఎదిగే అవకాశాలు రాలేదని చెప్పారు.  

పేపర్‌ లీక్‌ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం..   
రాజస్తాన్‌లో బీజేపీకి అధికారం అప్పగిస్తే అవినీతిపరుల భరతం పడతామని, వేగవంతమైన అభివృద్ధికి శ్రీకారం చుడతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఎంత దూరంగా ఉంటే రాజస్తాన్‌కు అంత మేలు జరుగుతుందని, భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ప్రజలకు సూచించారు. వెలుతురికి, చీకటికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే మంచికి, కాంగ్రెస్‌కు మధ్య కూడా ఉందని అన్నారు. రాష్ట్రంలో జల జీవన్‌ మిషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి ఉద్దేశించిన పథకంలోనూ నిధులు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, అభివృద్ధి అనేవి పరస్పరం శత్రువులని, ఆ శత్రుత్వం ఎప్పటికీ కొనసాగుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పేపర్‌ లీక్‌ మాఫియా యువత భవిష్యత్తును లక్షలాది రూపాయలకు అమ్మేసిందని ధ్వజమెత్తారు. ఎరువుల కుంభకోణంతో రైతులను విచ్చలవిడిగా లూటీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేపర్‌ లీక్‌ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు.  

2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్‌’  
రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ పాలనలో ధరలు భారీగా పెరిగిపోయానని మోదీ గుర్తుచేశారు. హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.13 అధికంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరలను సమీక్షిస్తామని, ప్రజలకు ఊరట కలి్పస్తామని వెల్లడించారు. కొన్నేళ్లలో అన్ని రంగాల్లోనూ భారత్‌ అద్భుతాలు చేసిందన్నారు. ఎటు చూసినా నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయని, 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు