Sanatan Dharma Remark Controversy: సనాతన ధర్మంపై మాట్లాడకండి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ సూచన

14 Sep, 2023 11:03 IST|Sakshi

సనాతన ధర్మంపై మాట్లాడకూడదని డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆదేశం

కేంద్రం అవినీతినే లక్ష్యంగా చేసుకోవాలని సూచన

ఈ అంశాన్ని కేంద్రం అస్త్రంగా మార్చుకుంటుందని స్పష్టం

కేంద్రం వైఫల్యాలపై దృష్టి మరల్చే ప్రయత్నిస్తోందని వెల్లడి

చెన్నై: సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని డీఎంకే చీఫ్ స్టాలిన్ పార్టీ నేతలకు తెలిపారు. బీజేపీ అవినీతినే లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు. 

'సనాతన ధర్మం అంశంపైనే తరచూ మాట్లాడటానికి కేంద్ర మంత్రులు నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ లోపాల నుంచి ప్రజలను దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారు. నేతలందరూ ఈ విశయాన్ని గమనించి సనాతన అంశానికి దూరంగా ఉండాలి.' అని స్టాలిన్ తమ పార్టీ వర్కర్లకు తెలిపారు. 

మతపరమైన, నిరంకుశ బీజేపీ పాలనను అంతం చేయడానికి నడుం బిగించాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని, హక్కులను కాపాడాలని సూచించారు. కేంద్ర పథకాలలోని అమలులో లోపాలపై స్పందించాలని చెప్పారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో మతపరమైన వ్యాఖ్యలకు తావివ్వకూడదని సూచించారు.  

ఇదీ చదవండి: Hindi Diwas: దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు?

మరిన్ని వార్తలు