బీజేపీలో సైలెంట్‌ వార్‌.. కార్యకర్తల్లో కొత్త టెన్షన్‌!

7 Jan, 2023 12:51 IST|Sakshi

ఎంపీ సోయం, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ మధ్య విభేదాలు

ఖానాపూర్‌ టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎంపీ

అంతర్గతంగా ఇతర నేతలను ఎంపీ ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం..

ఆసక్తి కలిగిస్తున్న పార్టీ పరిణామాలు

సాక్షి, ఆదిలాబాద్‌: బీజేపీలో ఇద్దరు ముఖ్య నేత ల మధ్య సైలెంట్‌ వార్‌ ప్రచారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పైకి ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం బలంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌ల మధ్య ఇటీవల జరి గిన పరిణామాలు ఈ సైలెంట్‌ వార్‌ను స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విభేదాలకు ప్రత్యేకంగా కారణం కనిపించకపోయినా రాను న్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్‌ దృష్టిలో పెట్టుకొని ఇద్దరి మధ్య ఎడమొహం.. పెడమొహం అన్నట్టుగా వ్యవహారాలు సాగుతున్నాయని వినిపిస్తుంది. 

పట్టు కోసం యత్నాలు..
రాజకీయంగా అనేక ఉత్తానపథనాలు చూసిన రమేశ్‌రాథోడ్‌ 2021 జూన్‌లో ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరారు. తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో ఆయన చేరికను ఎంపీ సోయం బాపూరావు వ్యతిరేకించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తొలిగి పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. అయితే కొంత కాలంగా మళ్లీ ఇద్దరి మధ్య సఖ్యత లేదని ప్రచారం సాగుతుంది. ఐదు నెలల క్రితం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాగోస–బీజేపీ భరోసా యాత్ర అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఖానాపూర్‌ నియోజకవర్గంలో రమేశ్‌రాథోడ్‌ ఆధ్వర్యంలో ఆ యాత్ర ఈటల రాజేందర్‌తో నిర్వహిస్తున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. ఆ యాత్ర నిలిచిపోయింది. ఈ ఇరువురి మధ్యలో విభేదాల కారణంగానే ఈ యాత్ర జరగలేదని పార్టీలో కార్యకర్తల మధ్య చర్చ సాగింది. 

ఎడమొహం.. పెడమొహం..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రమేశ్‌రాథోడ్‌ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా, జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2014 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల కు కొద్ది నెలల ముందు కాంగ్రెస్‌లో చేరి ఖానాపూర్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పుడు రేఖానాయక్‌ చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచి ప్రస్తుత ఎంపీ సోయం బాపూరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి పార్టీ పరంగా టికెట్‌ను ఆశిస్తూ అక్కడ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌ ఆశిస్తున్న సీనియర్‌ నాయకులు హరినాయక్, పెంబీ జెడ్పీటీసీ జానుబాయిలను అంతర్గతంగా ఎంపీ సోయం బాపురావు ప్రో త్సాహం అందిస్తున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. మొత్తంగా ప్రస్తుతం కమలం పార్టీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విభేదాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

మరిన్ని వార్తలు