బీసీలకు ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదు

1 Sep, 2020 04:57 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి చెల్లుబోయిన వేణు చిత్రంలో జంగా కృష్ణమూర్తి

బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూశారు 

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి వేణు మండిపాటు 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. బీసీలను ఆయన కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూశారని ధ్వజమెత్తారు. బీసీ ఓటు బ్యాంక్‌తోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని బాబు పూర్తిగా మరిచిపోయి వ్యవహరించారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మంత్రి వేణు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

► సంచార జాతుల వారు తమ సమస్యలను పాదయాత్రలో జగన్‌ దృష్టికి తెచ్చారు. వారికిచ్చిన హామీలన్నింటినీ సీఎం నెరవేర్చారు.   
► చంద్రబాబు పాలనలో బీసీలు విసిగిపోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది.  
► వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాట్లాడుతూ.. సంచార జాతులను గత ప్రభుత్వాలు విస్మరించాయని ధ్వజమెత్తారు.  
► సంచార జాతుల కోసం ప్రత్యేకంగా ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

సంచార జాతులపై సదస్సు 
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం భారతదేశ విముక్త సంచార జాతుల 68వ స్వాతంత్య్ర దినోత్సవం అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. మంత్రి చెల్లుబోయిన వేణు, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని మహాత్మా జ్యోతిరావ్‌ పూలే, వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న, గౌరవాధ్యక్షుడు గురుప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు