ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీనే: ఈటల

14 Jul, 2021 15:45 IST|Sakshi

అమిత్‌ షాతో ఈటల రాజేందర్ భేటీ

ఈటలతో పాటు ఢిల్లీ వెళ్లిన కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, వివేక్‌

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత అమిత్‌ షాతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈటలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ ఢిల్లీ వెళ్లారు. హుజురాబాద్ ఉపఎన్నికలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. 

భేటీ అనంతరం ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించాం. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారు. ఇందుకోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వస్తా అన్నారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీ మాత్రమే’’ అని ఈటల రాజేందర్‌ వక్కాణించారు.

డబ్బులు తీసుకుందాం.. ఈటలను గెలిపిద్దాం: బండి సంజయ్‌
భేటీ అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం. అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈ రోజు వచ్చి కలిశాము. ఈటల రాజేందర్ ఎన్నికల్లో గెలుస్తారనే సర్వే రిపోర్ట్స్ వచ్చాయి. బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా తెలంగాణకు వస్తామని అన్నారు. అలాగే పాదయాత్రకు కూడా ఆయన్ను ఆహ్వానించాం. ఆగస్టు 9న పాదయాత్ర మొదలవుతుంది’’ అని బండి సంజయ్‌ తెలిపారు.

‘‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధమే. టీఆరెస్ పార్టీ భయపడుతోంది. వారికి అభ్యర్థి కూడా దొరకడం లేదు. డబ్బులు ఎంత పంచినా.. అది ప్రజల సొమ్మే కాబట్టి తీసుకుందాం. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపిద్దాంఅవినీతి, అక్రమాల, అరాచక పాలనను అంతం చేయడం కోసం పాదయాత్ర చేపడుతున్నాం’’ అని బండి సంజయ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు