సిద్దిపేటలో ఘటన.. బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన
ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా కేంద్రానికే తలమానికమైన లాల్ కమాన్పై ఆదివారం అర్ధరాత్రి ఉన్నట్టుండి సీఎం కేసీఆర్ విగ్రహం వెలసింది. గుర్తుతెలియని వ్యక్తులు చేపట్టిన ఈ చర్య వివాదాస్పదమైంది. విషయం తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు రాత్రికిరాత్రే నిరసనకు పూనుకున్నారు. దీంతో కొద్దిసేపు లాల్కమాన్ వద్ద పోలీ సులకు, అఖిలపక్ష నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు రాత్రి 1.30 గంటలకు విగ్రహాన్ని పోలీసులు కిందకు దించడంతో అఖిలపక్ష నాయకులు శాంతించారు.
సోమవారం ఉదయం అఖిలపక్ష నాయకులు లాల్కమాన్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పాలు, పసుపు, కుంకుమలతో శుద్ధిచేశారు. బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షు డు బొమ్మల యాదగిరి మాట్లాడుతూ చరిత్రాత్మకమైన లాల్కమాన్పైన కేసీఆర్ విగ్రహం పెట్టడం సరికాదన్నారు.
నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలకు కారకులైనవారి విగ్రహం పెట్టడం ద్వారా లాల్కమాన్ అపవిత్రమైందని, అందువల్లే శుద్ధి కార్యక్రమం నిర్వహించామని అన్నారు. లాల్కమాన్ పైన విగ్రహం పెట్టిన వారిని 24 గంటల్లోపు అరెస్టు చేయాలని, లేనిపక్షంలో సిద్దిపేట బంద్కు పిలుపు ఇస్తామని హెచ్చరించారు.
(చదవండి: ఇంటర్ సిలబస్ 70 శాతానికి కుదింపు )