సీఎం కేసీఆర్‌కు ఓట్లతోనే పని 

27 Nov, 2022 01:20 IST|Sakshi
పాదయాత్రలో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

నమ్మి అధికారమిస్తే రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారు

పాదయాత్రలో వైఎస్‌ షర్మిల ధ్వజం 

నర్సంపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేవలం ఓట్లతోనే పని అని, ఓట్లుంటే బయటకు వస్తారు, లేకపోతే రారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఉద్యమకారుడని నమ్మి రెండు సార్లు ఎన్నుకుంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర శనివారం వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలంలో కొనసాగింది.

ఈ సందర్భంగా నల్లబెల్లిలో ఆమె మాటముచ్చట నిర్వహించారు. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని రూ.4లక్షల కోట్ల అప్పులు చేసి అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌కు అసలు పరిపాలన చేతకాదన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో వేల ఎకరాల్లో మిర్చి పంట వడగండ్ల వానతో నష్టపోతే పట్టించుకున్న పాపాన పోలేదని, మంత్రులు హెలికాప్టర్‌లో వచ్చి చూసి వెళ్లిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో దోచుకున్న డబ్బు తో బందిపోట్ల రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పెట్టారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగాల కల్పన మీద పెడతానని, రాష్ట్రంలో బెల్ట్‌ షాపులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు