సాగులో.. సాంకేతికత.. ప్రయొజనాలు అధికం

4 Oct, 2023 10:43 IST|Sakshi

డ్రోన్‌ సహాయంతో పురుగుమందుల పిచికారీ

రోజుకు 25 నుంచి 30 ఎకరాల్లో చేసే వీలు

కూలీల కొరతను అధిగమించే అవకాశం

సంగారెడ్డి: పంట సాగులో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కూలీల సమస్యను అధిగమించి అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా డ్రోన్‌లను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎరువులు, పురుగు మందుల పిచికారీకి కూలీలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కూలీల సమస్యను అధిగమించి అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు సాంకేతికత బాట పడుతున్నారు. మందులు పిచికారీ చేసేందుకు డ్రోన్‌లు చాలా ఉపయోగపడుతున్నాయి. సంగారెడ్డి జిల్లాతో ఇప్పటికే చాలా మంది రైతులు డ్రోన్‌లను వినియోగించడం విశేషం.

డ్రోన్‌ వినియోగంతో ప్రయోజనాలెన్నో ..
ఎకరా విస్తీర్ణంలో పురుగు మందుల పిచికారీ ఆరు నిమిషాల్లో పూర్తవుతుంది. ఎరువులకై తే 12 నిమిషాల సమయం పడుతుంది. అంతే కాకుండా రోజుకు 2530 ఎకరాల్లో పిచికారీ చేసేందుకు వీలు ఉంటుంది. మనుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డ్రోన్‌ ద్వారా ఎరువులు, పురుగు మందులు ఒకేసారి పిచికారీ చేయడం ద్వారా సులభంగా, చీడపీడల నివారణ అవుతుంది. ఎత్తు పల్లాలతో కూడిన పంట పొలాల్లోనూ సులభంగా మందులు చల్లవచ్చు.

డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీకి ఎకరాకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చవుతుంది. అదే కూలీకై తే రూ.800 రూ.1500) వరకు చెల్లించాల్సి వస్తుంది. రిమోట్‌ సాయంతో పనిచేసే ఈ డ్రోన్‌ల వల్ల పురుగు మందుల వృథా తగ్గడమే కాకుండా తగినంత ఎత్తు నుంచి పిచికారీ చేయడంతో సాగుకు సక్రమంగా మందు అందుతుంది.

మరిన్ని వార్తలు