Asia Cup 2023: అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ స్ట్రాంగ్‌ కౌంటర్‌.. తగ్గేదేలేదు!

22 Jun, 2023 11:25 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు కాబోయే చైర్మన్‌గా ప్రచారంలో ఉన్న జకా ఆష్రఫ్‌ వ్యాఖ్యలకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఆసియా కప్‌-2023 నిర్వహణ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని.. ముందుగా అనుకున్నట్లుగానే టోర్నీ నిర్వహించి తీరతామని ఏసీసీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌ నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాక్‌కు పంపేది లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి గతంలోనే కరాఖండిగా చెప్పేసింది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ మోడల్‌ తెర మీదకు రాగా.. పాకిస్తాన్‌లో 4 మ్యాచ్‌లు.. శ్రీలంకలో 9 మ్యాచ్‌ల నిర్వహణకు పీసీబీ అంగీకరించింది.

అయితే, నజమ్‌ సేథీ పీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ నిర్ణయం కాగా.. అతడి స్థానాన్ని భర్తీ చేయబోతున్న జకా ఆష్రఫ్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ మేరకు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను హైబ్రిడ్‌ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నానని తెలిపాడు.

ఈ క్రమంలో జకా వ్యాఖ్యలపై స్పందించిన ఏసీసీ మెంబర్‌.. ‘‘ఆసియా కప్‌ మోడల్‌పై తుది నిర్ణయం జరిగిపోయింది. ఏసీసీ ఇందుకు అంగీకారం తెలిపింది. మా నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఆష్రఫ్‌ తాను ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడొచ్చు.. మాకేం సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. 

కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్‌-2023పై మరోసారి గందరగోళం నెలకొంది. ఇక ఆగష్టు 31- సెప్టెంబరు 17 వరకు ఈ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఇక ఆసియా టీ20 కప్‌-2022లో శ్రీలంక విజేతగా అవతరించగా.. పాక్‌ రన్నరప్‌గా నిలిచింది.

చదవండి: 'గిల్‌ క్యాచ్‌' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! 
స్కాట్లాండ్‌ ప్లేయర్‌ విధ్వంసం; ఒక్క వికెట్‌ తేడాతో సంచలన విజయం

మరిన్ని వార్తలు