Asian Games 2023 Women's Cricket: పాక్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. ఫైనల్లో టీమిండియాతో 'ఢీ'

24 Sep, 2023 14:37 IST|Sakshi

ఏషియన్‌ గేమ్స్‌ 2023 వుమెన్స్‌ క్రికెట్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. ఇవాళ (సెప్టెంబర్‌ 24) జరిగిన సెకెండ్‌ సెమీఫైనల్లో లంకేయులు పాక్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో షావాలా జుల్ఫికర్‌ (16), ఒమైమా సోహైల్‌ (10), మునీబా అలీ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అమీన్‌ (3), కెప్టెన్‌ నిదా దార్‌ (9), అలియా రియాజ్‌ (2), నటాలియా పర్వేజ్‌ (8). ఉమ్‌ ఎ హనీ (9), డయానా బేగ్‌ (9), నస్రా సంధు (0) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలోప్రబోదని 3 వికెట్లు పడగొట్టగా.. కవిష దిల్హరి 2, ప్రియదర్శిని, అచిని కులసూరియా, రణవీర తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్‌ చమారీ ఆటపట్టు 14, అనుష్క సంజీవని 15, హర్షిత సమరవిక్రమ 23, విష్మి గుణరత్నే 0 పరుగులు చేయగా.. నిలక్షి డిసిల్వ 18, హసిని పెరీరా 1 శ్రీలంకు విజయతీరాలకు చేర్చారు. పాక్‌ బౌలర్లలో సదియా ఇక్బాల్‌, డయానా బేగ్‌, ఉమ్‌ ఎ హనీ తలో వికెట్‌ పడగొట్టారు.

ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టనున్న శ్రీలంక..
రెండో సెమీస్‌లో పాక్‌పై గెలుపుతో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. గోల్డ్‌ మెడల్‌ కోసం జరిగే తుది సమరంలో లంకేయులు టీమిండియాను ఢీకొట్టనున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 11:30 గంటలకు మొదలవుతుంది. కాగా, ఇవాలే జరిగిన తొలి సెమీస్‌లో భారత్‌.. బంగ్లాదేశ్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది.

మరిన్ని వార్తలు