Badminton Asia Mixed Team Championships 2023: తొలిసారి సెమీస్‌లో భారత్‌

18 Feb, 2023 06:07 IST|Sakshi

ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. దుబాయ్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3–2తో హాంకాంగ్‌పై నెగ్గింది. 0–2తో వెనుకబడిన భారత్‌ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–13, 21–12తో ఎన్జీ సాజ్‌ వైయు–ఎన్జీ వింగ్‌ యుంగ్‌ జోడీపై నెగ్గి భారత్‌కు సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసింది.

తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇషాన్‌–తనీషా 24–26, 17–21తో లీ చున్‌ రెగినాడ్‌–ఎన్జీ సాజ్‌ వైయు చేతిలో... లక్ష్య సేన్‌ 22–20, 19–21, 18–21తో ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో ధ్రువ్‌ కపిల–చిరాగ్‌ శెట్టి జోడీ 20–22, 21–16, 21–11తో తాంగ్‌ చున్‌ మన్‌–యెంగ్‌ షింగ్‌ చోయ్‌ ద్వయంపై నెగ్గగా... నాలుగో మ్యాచ్‌లో పీవీ సింధు 16–21, 21–7, 21–9తో సలోని మెహతాను ఓడించడంతో భారత్‌ 2–2తో స్కోరును సమం చేసింది.  

మరిన్ని వార్తలు