సొంత జట్టు ఆడే మ్యాచ్‌లను సైతం పాక్‌లో ‍‍ప్రసారం చేసేందుకు అయిష్టత

9 Jun, 2021 19:21 IST|Sakshi

లాహోర్‌: భారత కంపెనీలైన స్టార్‌, ఆసియా ఛానెల్‌లకు దక్షిణాసియా క్రికెట్‌ ప్రసార హక్కులు దక్కాయన్న కారణంగా, తమ దేశం ఆడే క్రికెట్‌ మ్యాచ్‌లను సైతం పాక్‌లో ప్రసారం చేసేందుకు  అక్కడి ప్రభుత్వం నో చెప్పింది. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసినందు వల్ల తాము భారత కంపెనీలతో వ్యాపారం చేయబోమని పాక్‌ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ మంత్రి ఫవాద్‌ చౌదరి వెల్లడించారు. భారత్‌ ప్రభుత్వం స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాకే ఆయా కంపెనీలతో తాము వ్యాపారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

ఈ చర్య వల్ల తమ దేశ క్రికెట్ బోర్డుకు నష్టపోయినా పర్వాలేదని, తమ నిర్ణయంలో మాత్రం ఏ మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. కాగా, వచ్చే నెల ఇంగ్లండ్‌లో పర్యటించనున్న పాక్‌.. మూడు వన్డేలు (జులై 8, 10, 13), మూడు టీ20లు (జులై 16, 18, 20) ఆడనుంది. ఈ ఆరు మ్యాచ్‌లను తమ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రసారం చేసేది లేదని ఆక్కడి ప్రభుత్వం భీష్మించుకుని కుర్చుంది. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ క్రికెట్‌ అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌పై విషం కక్కే క్రమంలో పాక్‌.. తమ వేలితో, తమ కంటినే పొడుచుకుంటుందని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌ పేరు ఖరారు..?
 

మరిన్ని వార్తలు