వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ కన్నుమూత

13 Oct, 2022 13:48 IST|Sakshi
బ్రూస్ పైరౌడో(File Photo)

వెస్టిండీస్‌ మాజీ టెస్టు క్రికెటర్‌ బ్రూస్ పైరౌడో గురువారం కన్నుమూశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల బ్రూస్‌ పైరౌడో గురువారం ఉదయం  న్యూజిలాండ్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు. 1931 ఏప్రిల్‌ 14న అప్పటి బ్రిటీష్‌ గయానాలో బ్రూస్‌ పైరౌడో జన్మించాడు. 1953-57 మధ్య కాలంలో విండీస్‌ తరపున 13 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన బ్రూస్‌ పైరౌడో ఒక సెంచరీ సాయంతో 454 పరుగులు చేశాడు.

ఆ ఒక్క సెంచరీ కూడా 1953లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సాధించాడు. ఇక ఆయన ఆడిన 13 టెస్టుల్లో ఏడు టెస్టులు స్వదేశంలో.. మిగతా ఆరు టెస్టులు న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ గడ్డపై ఆడాడు. ఇక 26 సంవత్సరాల వయసులో బ్రూస్‌ లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తన చివరి టెస్టు ఆడాడు.

1956లో విండీస్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. అక్కడే బ్రూస్‌ ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత బ్రూస్‌ పైరౌడో వెస్టిండీస్‌ నుంచి న్యూజిలాండ్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. న్యూజిలాండ్‌ తరపున దేశవాలీ టోర్నీల్లో ఆడిన బ్రూస్‌ 1966-67లో అంతర్జాతీయ సహా అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 

చదవండి: రక్తం కళ్ల చూసిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. వీడియో వైరల్‌

మెరిసిన అశ్విన్‌, హర్షల్‌.. టీమిండియా టార్గెట్‌ 163

మరిన్ని వార్తలు