'ఇలాగే ఆడితే రికార్డులు బ్రేక్‌ అవడం ఖాయం'

26 Jan, 2021 21:35 IST|Sakshi

లండన్‌: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డ్‌ని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్రేక్ చేస్తాడని మాజీ ఆటగాడు జెఫ్రీ బాయ్‌కాట్ జోస్యం చెప్పాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. సోమవారం ముగిసిన శ్రీలంక టూర్‌లో జో రూట్ టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఇదే జోరుని రూట్ కొనసాగిస్తే సచిన్ రికార్డ్ బ్రేక్ అవడం ఖాయమని బాయ్‌కాట్ చెప్పుకొచ్చాడు.

'ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్ స్థానం మరిచిపోకండి. ఎందుకంటే.. జో రూట్‌కి కనీసం 200 టెస్టులు ఆడే సామర్థ్యం ఉంది. ఒకవేళ అతను అన్ని టెస్టులు ఆడితే కచ్చితంగా సచిన్ అత్యధిక పరుగుల రికార్డ్‌ని బ్రేక్ చేయగలడు. రూట్ వయసు ఇప్పుడు కేవలం 30 ఏళ్లే. ఇప్పటికే 99 టెస్టులాడిన అతని 8,249 పరుగులు చేశాడు. కాబట్టి.. ఇకపై కెరీర్‌లో ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే తప్ప సచిన్ ఆల్‌టైమ్ రికార్డ్‌ని అతను బద్దలు కొట్టలేకపోవడానికి పెద్దగా కారణలేమీ కనిపించడం లేదు'అని బాయ్‌కాట్ వెల్లడించాడు. చదవండి: ధోని దంపతులతో చిల్‌ అయిన పంత్

గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 228 పరుగులు చేసిన జో రూట్.. రెండో టెస్టులోనూ 186 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 106.50 సగటుతో 426 పరుగులు చేశాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఒంటిచేత్తో ఇంగ్లండ్‌ని సిరీస్ విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గానూ రూట్ నిలిచాడు. ఇప్పటి వరకూ 99 టెస్టులాడిన జో రూట్ 49.39 సగటుతో 8,249 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రూట్ 29వ స్థానంలో కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు.చదవండి: 'స్మిత్‌ను పంపించాం.. స్టోక్స్‌ను వదులుకోలేం'

>
మరిన్ని వార్తలు